Putta Madhu: న్యాయవాదులు వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టా మధు మీద జరుగుతున్న పోలీసు ఎంక్వైరీలో రోజుకో విషయం బయటకు వస్తోంది. బినామీల పేరుతో మధు వందల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్టు మంథని మాజీ సర్పంచ్ ఇనుముల సతీశ్ ఐటీ, సీబీఐ, ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్రలోనూ భారీగా పెట్టుబడులు పెట్టినట్టుగా కంప్లైంట్ చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో సోదరుడి పేరు మీద ఇసుక క్వారీ నడిపిస్తున్నట్టుగా ఆరోపించారు.
ఆ చిట్ ఫండ్ కంపెనీ అయనదేనా?
దుబాయ్, అరబ్ దేశాల్లోనూ పెట్టుబడులు పెట్టినట్టుగా అవన్నీ అక్రమాస్తులంటూ కంప్లైంట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన భవిత శ్రీ చిట్ ఫండ్స్లో పుట్ట మధు 50 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినట్టు.. వామన్రావు హత్య కేసుకు సంబంధించి రెండు కోట్ల రూపాయల సుపారీ ఇక్కడి నుంచే చెల్లించినట్లు ఫిర్యాదు చేశారు.మరోవైపు పలు నిర్మాణ కంపెనీలకు పనులు వచ్చేలా చేసి కమిషన్ తీసుకున్నట్టు ప్రత్యర్థులు ఆరోపణలు చేస్తున్నారు. పెద్దపల్లి నుంచి కాటారం వరకు ఉన్న డబుల్ రోడ్డును 9 మీటర్ల విస్తరణకు అప్పట్లో సీఎం కేసీఆర్కు పుట్ట మధు లేఖ రాశారు. ఈ పనులు దక్కించుకున్న ఆర్ అండ్ బీ కాంట్రాక్టర్ల నుంచి కమిషనర్ తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
లాయర్ దంపతుల హత్యకేసులో బిగుస్తున్న ఉచ్చు!
ఇదిలా ఉండగా వామన్రావు హత్య కేసులో పుట్ట మధుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్న విషయం తెలిసిందే.ఇందులో భాగంగా పుట్ట మధు భార్య శైలజ రామగుండం పోలీస్ కమిషనరేట్కు వచ్చారు. అయితే నంబర్ ప్లేట్ లేని వాహనంలో రావడం చర్చనీయాంశంగా మారింది.క్రమంగా పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వామన్ రావు దంపతుల హత్య కేసులో రెండు రోజులుగా విచారణ జరుగుతోంది. రామగుండం కమిషనరేట్ లో 2 బృందాలుగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. న్యాయవాది వామన్ రావు దంపతుల కేసులో రూ. 2 కోట్లు సుపారీ ఇచ్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.కారణాలేవైనప్పటికీ మొట్టమొదలు ప్రాథమిక విచారణ పూర్తయిన అనంతరం పోలీసులు ఇంటికి పంపేశారు తదుపరి ఏం జరుగుతోందో వేచి చూడాలి!