కౌన్ బనేగా కరోడ్ పతి.. ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసు కదా. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన షో ఇది. దీనికి బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎవరైనా ఈ షోలో పొల్గొనవచ్చు. షోలో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబితే కోట్లలో డబ్బు గెలుచుకోవచ్చు.
ఈ షోలో అనేక అంశాలపై ప్రశ్నలు అడుగుతుంటారు. సమకాలీన అంశాలు, రాజకీయాలు, సినిమాలు, క్రీడలు, జీకే.. ఇలా పలు అంశాలపై ప్రశ్నలు ఉంటాయి.
ఇటీవలే కొత్త సీజన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అందులో వైఎస్సార్సీపీకి చెందిన ఓ ప్రశ్నను అమితాబ్ అడిగారు. యూపీకి చెందిన సోనూ కుమార్ గుప్తా అనే వ్యక్తి ఈ షోకు వచ్చాడు. 12 ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. 12 ప్రశ్నలకు సమాధానం చెప్పి 12.5 లక్షలు గెలుచుకున్నాడు.
13వ ప్రశ్నగా వైఎస్సార్సీపీకి చెందిన ప్రశ్నను అడిగారు బిగ్ బీ. ఆ ప్రశ్నకు సమాధానం చెబితే 25 లక్షల రూపాయలు వస్తాయి. తప్పు చెబితే వచ్చిన డబ్బులు మొత్తం పోతాయి.
2019లో పీ సుభాష్ చంద్రబోస్ అనే రాజకీయ నేత.. ఏ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు? అనేదే ప్రశ్న. దానికి నాలుగు ఆప్షన్లను కూడా ఇచ్చారు. అందులో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటకలను ఇచ్చారు.
అయితే.. సోనూ కుమార్ గుప్తా… యూపీకి చెందిన వ్యక్తి కావడంతో వైఎస్సార్సీపీ పార్టీ గురించి ఎక్కువగా తెలియలేదు. ముందుగా ఆయనకు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టంగా అనిపించింది. మనసులో ఆంధ్రప్రదేశ్ అని అనుకుంటున్నట్టుగా అమితాబ్ కు చెప్పారు కానీ రిస్క్ తీసుకోలేదు.
తనకు ఉన్న ప్రత్యామ్నాయాలను కూడా వాడుకున్నప్పటికీ సమాధానం చెప్పలేక క్విట్ అయ్యాడు సోనూ. అయితే.. క్విట్ అయినప్పటికీ ఆ ప్రశ్నకు ఊరికనే సమాధానం చెప్పాలంటూ బిగ్ బీ అడిగాడు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ అని సోనూ చెప్పాడు. నిజానికి అదే సరైన సమాధానం.
ఆ తర్వాత వైఎస్సార్సీపీ పార్టీ గురించి.. పిల్లి సుభాష్ చంద్రబోస్ గురించి అమితాబ్.. సోనూకు వివరించారు. 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యారని అమితాబ్ అన్నారు. అప్పుడు కొత్త కేబినేట్ లో ఐదుగురు ఉపముఖ్యమంత్రులను తీసుకోగా.. అందులో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒకరని అమితాబ్.. సోనూ కు వివరించారు.