తెలుగు మీడియాలో ఎలక్ట్రానికి, ప్రింట్ మీడియా ఏదొక రాజకీయ పార్టీకి అనుబంధంగానే కొనసాగుతున్నాయి. జగన్ కు సాక్షి, టీడీపీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఉన్నాయి. అయితే.. ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు టీడీపీకి దెబ్బ కొట్టేలా ఉంటున్నాయి. చంద్రబాబుకు బాకా ఊదే క్రమంలో దారుణమైన తప్పిదాలు చేస్తున్నారు. దీంతో సాధారణ పాఠకులే కాకుండా టీడీపీ అభిమానులను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. కొత్తపలుకులో ఆయన నిన్న రాసిన రాతలే ఇందుకు ఉదాహరణ.
జగన్ మీద కేసులకు చంద్రబాబు కారణమా..? దారి మళ్లించిన రాధాకృష్ణ..
సీఎం జగన్ మీద సీబీఐ 11 కేసులు నమోదు చేసి ఏ1గా పేర్కొంటూ చార్జిషీట్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుమారు 43వేల కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ అభియోగాలు చేసింది. ఇప్పటికీ ఈ కేసుల్లో జగన్ ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఈ కేసుల విషయంలో సోనియా కక్షగట్టారని, కోర్టులు సీబీఐకి అధికారాలు ఇచ్చిందనే ఇన్నాళ్లూ అనుకున్నారు. చంద్రబాబు పాత్ర ఉందని వైసీపీ ఆరోపించినా ఎవరూ నమ్మలేదు. కానీ.. నిన్న ఆర్కే కొత్తపలుకు రాతలు కొన్ని అనుమానాలు రేకెత్తెస్తున్నాయి. జస్టిస్ ఈశ్వరయ్యను న్యాయమూర్తిగా నియమించడంలో చంద్రబాబే కీలకంగా వ్యవహరించారనీ జగన్ పై సీబీఐ కేసులు, తీర్పుల విషయంలో కూడా ఈశ్వరయ్యే కీలక పాత్రనీ ఆర్కే రాశారు. అంటే జగన్ పై కేసుల విషయంలో చంద్రబాబు పాత్ర ఉందని ఆర్కే నేరుగా ఒప్పుకున్నట్టైంది. దీంతో చంద్రబాబును, న్యాయమూర్తులను, న్యాయ వవస్థను అనుమానించే పరిస్థితి కల్పించారు. దీంతో పాఠకుల్లో.. వైసీపీ వర్గాల్లో టీడీపీపై, టీడీపీ అభిమానులు, కార్యకర్తలు అర్కేను అసహ్యించుకునేలా చేసారు.
అతి తెలివి ఇంత దెబ్బ తీసిందా..!
ఆర్కే తన రాతల్లో చంద్రబాబుకు మేలు చేసేలానే ఊహించుకుని రాస్తారు. అంతిమంగా ఫలితం మాత్రం చంద్రబాబుకు వ్యతిరేకంగా వస్తుంది. గతంలో అనేక సందర్బాల్లో కేసీఆర్, చంద్రబాబు పాలనపై పోలిక పెడుతూ రాసిన రాతలతో చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగింది. ప్రస్తుతం జగన్ పై ఏపీలో సానుకూలత ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకంగా వార్తలు రాసి చంద్రబాబుకు మరింత నష్టం చేకూరుస్తున్నారు. ఈ రాతలను చంద్రబాబు, ఆర్కే ఎంతమేర సమర్ధించుకుంటారో తేలాల్సిన విషయం.