ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు రూటే సెపరేటు అనే సంగతి తెలిసిందే. ఆయన ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేయడం, ఏకంగా సస్పెన్షన్ చేయాలంటూ ఫిర్యాదు చేసే స్థాయికి చేరిపోవడం తెలిసిన సంగతే.
కానీ రఘురామ కృష్ణంరాజు మాత్రం తన వైఖిరిన మార్చుకోకుండా కామెంట్ల పరంపర కొనసాగిస్తున్నారు. అయితే, తాజాగా ఆయన పిరికితనం ఏంటో బయటపడిందని అంటున్నారు.
రాజుగారి రచ్చ మామూలుగా లేదు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంది. పార్టీ లైన్ క్రాస్ చేస్తున్నారంటూ వైసీపీ నోటీసులు ఇవ్వగా నోటీసులపై స్పందించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆ నోటీసుకు చట్టబద్ధత లేదని అన్నారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారు. నోటీసు ఇచ్చిన లెటర్ హెడ్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉందని.. లెటర్ హెడ్కు, బీఫామ్కు తేడా ఉందని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నోటీసు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని రఘురామకృష్ణంరాజు ట్విస్ట్ ఇచ్చారు. షోకాజ్ నోటీసులో పార్టీ లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇవ్వకుండా.. టెక్నికల్ పాయింట్లను లేవనెత్తడం.. పొంతన లేని సమాధానాలు ఇవ్వడం వైసీపీ అధిష్టానం అసంతృప్తి పీక్స్కు చేరింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరుతూ, లోకసభ స్పీకర్కు అనర్హత పిటిషన్ ఇచ్చింది.
అబ్బే రాజు గారి రూటే సపరేటు
తన రూటే సపరేటు అన్నట్లుగా రఘురామకృష్ణంరాజు స్పీకర్, కేంద్ర హోంశాఖకు లేఖ రాయడం.. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లిన రఘురామకృష్ణంరాజు కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర మంత్రులను కలవడం తదితర పరిణామాలను కూడా వైసీపీ అధిష్టానం సీరియస్గా తీసుకుంది. లోక్సభ స్పీకర్కు అనర్హత పిటిషన్ అందిచినప్పటికీ ఆయన రూట్ మార్చుకోలేదు. తన కామెంట్ల పరంపర కొనసాగిస్తున్నారు. తనదైన కామెంట్లతో అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నారు.
రఘురామ కృష్ణంరాజులో ఇంత భయం ఉందా?
ఏపీలో జరిగిన ఓ శిరోముండనం ఘటన గురించి రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సంచలనం సృష్టించిన శిరోముండనం ఘటనలో ముఖ్యమంత్రికి అతి దగ్గరగా ఉండి అతి చేసే నాయకుడే ప్రధాన కారణం అని తెలుస్తుందన్న రఘురామ కృష్ణంరాజు ఇప్పటికైనా సీఎం చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. ఆ వ్యక్తే ఆయనే ఇన్ స్పెక్టర్తో మాట్లాడారని , శిరోముండనం చేయించమని చెప్పకపోయినా, తీవ్రంగా దండించమని చెప్పినట్టున్నారు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి కార్యాలయం మూడు సార్లు ఆదేశాలు ఇచ్చాక శిరో ముండనం కేసులో సీఎం స్పందించారని పేర్కొన్నారు. రఘురామ కృష్ణం రాజు ఆ వ్యక్తి ఎవరో తనకు తెలుసునని సీఎం జగన్ నిజనిర్ధారణ చెయ్యాల్సి ఉందని పేర్కొన్నారు. ఇందులో బంధుప్రీతిని పక్కన పెట్టి పారదర్శకంగా వ్యవహరిస్తే మీకు మంచి పేరు వస్తుంది అని పేర్కొన్నారు. తన సంచలన కామెంట్లతో ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నట్లు కనపడుతున్న రఘురామ కృష్ణంరాజులో ఓ రేంజ్లో పిరికితనం ఉందని అంటున్నారు. సీఎం జగన్ బంధుప్రీతికి, ఆశ్రితపక్షపాతానికి అతీతంగా ఉంటానని చెప్పారు కాబట్టి చెబుతున్నానంటూ పేర్కొన్న నరసాపురం ఎంపీ సదరు వ్యక్తి పేరును ఎందుకు బయటపెట్టడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన వ్యక్తిగా ప్రచారం చేసుకుంటున్న ఆయన ఓ సామాన్య నేత పేరు చెప్పేందుకు ఎందుకు సంశయిస్తున్నారని పలువురు కామెంట్ చేస్తున్నారు.