RRR: రఘురామకృష్ణ రాజు RRR వైసీపీ రెబల్ ఎంపీ మరో వివాదాస్పద అంశంపై పోరు మొదలుపెట్టారు. అవకాశం చిక్కినప్పుడల్లా పార్టీ తీరుపై, నాయకుల చర్యలపై మండిపడే ఆయన ఏకంగా పార్టీ అధినేత.. ఏపీ సీఎం జగన్ నే టార్గెట్ చేశారు. ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ తీర్పు ఈ నెల 27న రానుంది. ఇప్పుడు మరోసారి తన మార్క్ స్టయిల్ తో ముందుకొచ్చారు. రీసెంట్ గా జరిగిన తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల అంశం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ విషయాన్నే తీసుకుని ఏకంగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అక్కడ విపరీతంగా దొంగ ఓటర్ కార్డుల ముద్రణ జరిగిందని ఆరోపించారు. దీనిని దేశద్రోహంగా పరిగణించాలని కోరుతూ ఏకంగా హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాసి సంచలనం రేపారు. దేశ సార్వభౌమాధికార సమగ్రతకు దొంగ ఓట్ల ముద్రణ ప్రమాదకరమని పేర్కొన్నారు. ఇది దేశానికి జరుగుతున్న నష్టంగా పరిగణించాలని ఫిర్యాదు చేశారు. లక్షలాదిగా దొంగ ఓటర్ కార్డులు ముద్రించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించకపోతే ఇటువంటి ఐడీ కార్డులు తయారుచేసి ఓట్లు వేయడం సాధారణమైపోతుందని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఈ దేశద్రోహానికి పాల్పడ్డాయని ఆరోపించారు.
ఈక్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్టు రఘురామకృష్ణ రాజు తెలిపారు. ఇటువంటి సంఘవిద్రోహ శక్తులను అరికట్టాలని అన్నారు. ఈ సంఘటనలను తాను వదిలిపెట్టనని, కేంద్రంతో పోరాడైనా విచారణ జరిపేలా ఒత్తిడి తీసుకొస్తానని అంటున్నారు. ఇప్పటికే తిరుపతి ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ అభ్యర్ధి రత్నప్రభ హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ అంశాన్ని ఎన్ఐఏ ద్వారా విచారణ జరిపించాలని కూడా డిమాండ్ చేయడం సంచలనం రేపుతోంది. దీంతో రఘురామ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. మరి.. రఘురామ లేఖపై కేంద్రం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.