నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు దాదాపు వైసీపీతో తెగతెంపులు చేసుకున్నారు. రెబల్ ఎంపీగా ఇప్పటికే పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. సీఎం జగన్ పై వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని కూడా పిచ్చి నిర్ణయమంటూ విమర్శలు చేస్తున్నారు.
ఎంపీ తీరు వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారని ఇప్పటివరకూ అనుమానాలు ఉండేవి. కానీ.. ఆయనకు బీజేపీ సపోర్ట్ లేదని ఆయన వ్యవహారశైలితోనే ఈ వ్యాఖ్యలు వస్తున్నాయని తెలుస్తోంది.నిజానికి అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర పార్టీల వైపు చూడరు. ఎంపీ అంటే ఏడు నియోజకవర్గాలు ఆయన అదుపులో ఉన్నట్టే. దీంతో అప్రతిహతంగా ఆయన పదవీ కాలాన్ని పూర్తి చేయొచ్చు. కానీ..
రఘురామకృష్ణ రాజు తీరు వేరే విధంగా ఉంది. గెలిచిన పార్టీపైనే.. అది కూడా అధికారంలో ఉన్న పార్టీపైనే ఆయన విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారం వెనుకు ఆయన బీజేపీలో చేరతారనే వ్యాఖ్యలు వచ్చాయి. కానీ.. ఆయనకు బీజేపీ నుంచి కూడా ఆహ్వానం లేదని తెలుస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు రఘురామకృష్ణ రాజు గతంలో పలు పార్టీలు మారి వైసీపీలో చేరారు.
ఇక్కడ ఎంపీగా గెలిచి కూడా పక్క పార్టీ వైపు దృష్టి పెడుతూండటంతో బీజేపీ దూరం పెడుతోందని అంటున్నారు. పార్టీలోకి ఆహ్వానిస్తే వైసీపీతో ఉన్న స్నేహం చెడినట్టు అవుతుందని భావిస్తున్నాయట బీజేపీ వర్గాలు. ఆయనకు సొంత ఇమేజ్ లేదనే అభిప్రాయానికి కూడా బీజేపీ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణ రాజుకు బీజేపీతో పాటు అన్ని పార్టీల దార్లు మూసేసాయని అంటున్నారు. టీడీపీ నుంచి కూడా ఎంపీపై సానుకూల దృకపథం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణ రాజుపై అనర్హత వేటు పడినట్టైతే ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడినట్టే.