రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ఇటివలి వరకూ వైసీపీ ఎమ్మెల్యేలను, ప్రభుత్వంలోని కొందరు పెద్దలను విమర్శించారు. జగన్ ను నేరుగా విమర్శించకుండా జగన్ తీసుకున్న నిర్ణయాలను తప్పు పడున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారని, పార్టీ వీరిని చూసి చూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపణలు చేస్తున్నారు. దీంతో దాదాపు పార్టీకి దూరమయ్యారు.
రీసెంట్ గా ఆయన చేసిన వ్యాఖ్యలు సచివాలయంలో అధికారవర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి. మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం వెనుక ఓ అధికారి కారణమని.. సీఎం కార్యాలయంలోనూ, సచివాలయంలోనూ ఓ అధికారి హవా బాగా నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. ఆయన చెప్పిన ఐఏఎస్ ఎవరనే చర్చ నడుస్తోంది.
ఈ ముగ్గురిలో ఎవరై ఉండొచ్చు..
రఘురామకృష్ణ రాజు అంత తేలిగ్గా కొట్టిపారేసేవి కావు. ఆయనకు విస్తృతస్థాయిలో పరిచయాలు ఉన్నాయి. సచివాలయంలోనూ, సీఎం కార్యాలయంలోనూ కొందరు ఐఏఎస్ అధికారులు తిష్ట వేస చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఓ సామాజికవర్గం పెద్దలు సచివాలయంలో చేరి అధికారులను శాసిస్తూ చంద్రబాబు కోటరీగా మారి పనులు జరిపించేవారు. కానీ.. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏకంగా ఐఏఎస్ అధికారులే కర్త, కర్మ, క్రియలుగా మారారు. అజయ్ కల్లం, ప్రవీణ్ ప్రకాశ్.. తదితరుల హవా బాగా నడుస్తోంది.
ఎవరికి ప్రమోషన్లు కావాలన్నా, ఏ జిల్లాలకు ఏ అధికారి కావాలన్నా.. ఎమ్మెల్యేలకు పని జరగాలన్నా ప్రవీణ్ ప్రకాశ్ అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. అజయ్ కల్లాం కూడా కొన్ని వ్యవహారాల్లో కీలకంగా మారారు. ఈ తరుణంలో ఈ ఇద్దరు ఐఏఎస్ లు.. లేదా రఘురామకృష్ణ రాజు చెప్పిన వారి లిస్టులో మరెవరైనా ఉన్నారా అనే సందేహం కలుగుతోంది. ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలు రఘురామ మాత్రమే చేశారు. కానీ.. పార్టీలోని మరికొందరు కూడా జగన్ నిర్ణయాలపై అంతర్గతంగా నలిగిపోతున్నారని అంటున్నారు. జగన్ చుట్టూ ఐఏఎస్ లు చేరారని, అందువల్లే జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పినా ఆశ్చర్యపోనవసరం లేదు.