నరసాపురం వైసీపీ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పొలిటికల్ ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఉన్న కొద్దీ హాట్ హాట్ గా మారుతోంది. రాజు గారు ఎక్కడా తగ్గడం లేదు. గెలిచిన నాటినుండి పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏకంగా ప్రభుత్వంపైనే విమర్శలు చేసే విధంగా మారిపోయారు. సొంత పార్టీ నేతలు ప్రజాప్రతినిధులు అవినీతిపరులంటూ వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే పేరున్న మీడియా చానల్స్ కి ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూలు ఇస్తూ జగన్ సర్కార్ పరువును తీసే విధంగా వ్యవహరిస్తున్నారు. దీంతో రఘురామకృష్ణంరాజు ఉన్న కొద్దీ హద్దులు మీరుతున్న తరుణంలో పార్టీ ఇటీవల షోకాజ్ నోటీసులు ఇవ్వడం అందరికీ తెలిసిందే.
అయితే తనకు నోటీసులు ఇవ్వడం పట్ల రఘురామకృష్ణంరాజు లాజికల్ గా వైసీపీ పార్టీని ఇరుకున పెట్టే విధంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు లోకేష్ నే టార్గెట్ చేసినట్లు అయిందని ఏపీ రాజకీయాల లో వినబడుతున్న టాక్. పూర్తి మేటర్ లోకి వెళ్తే జాతీయ ప్రధాన కార్యదర్శిగా విజయసాయిరెడ్డి తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వటం కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలకు విరుద్ధమని రఘురామకృష్ణంరాజు షాకింగ్ కామెంట్ చేయడం జరిగింది. అసలు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర వైయస్సార్ సిపి పార్టీ ప్రాంతీయ పార్టీగా రిజిస్టర్ అయిందని చెప్పుకొచ్చారు. ఇలాంటి తరుణంలో జాతీయ పార్టీ గా ఎన్నికల సంఘం గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో పోటీ చేయాలి.
కానీ ఆ విధంగా వైసీపీ పార్టీ ఎక్కడ పోటీ చేయలేదు. ఈ విధంగా రఘురామకృష్ణంరాజు లాజికల్ గా వైసీపీ పార్టీ కి జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటున్న విజయసాయి రెడ్డి పై సెటైర్లు వేశారు. కాగా మరో పక్క టీడీపీ పార్టీ కూడా జాతీయ పార్టీగా చెప్పుకుంటూ… జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఉన్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ప్రాంతీయ పార్టీగా రిజిస్టర్ అయి ఉంది. దీంతో ఇప్పుడు రఘురామకృష్ణంరాజు జాతీయ ప్రధాన కార్యదర్శి గా విజయసాయి రెడ్డి పై వేసిన సెటైర్ లు మరోపక్క నారా లోకేష్ కి కూడా వర్తించే విధంగా ఉన్నాయని.. మొత్తానికి అధికార పార్టీ పరువు తీస్తూనే మరోపక్క అనుకోకుండా ప్రతిపక్ష పార్టీ టీడీపీ పరువు కూడా రఘురామకృష్ణంరాజు తీసేశారు అని భావిస్తున్నారు పరిశీలకులు. రాజుగారు బయటకు లాగిన ఈ లాజిక్ పాయింట్ జాతీయ పార్టీలు అని గొప్పలు చెప్పుకుని కాలర్ లు ఎగరేసే పార్టీల గుట్టు రట్టు చేసినట్లు అయిందని మరికొంతమంది అంటున్నారు.