Raghuramakrishna raju: వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు Raghuramakrishna raju అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్ని కుదిపేస్తోంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే వ్యాఖ్యలు, కులాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఆయన అరెస్టయినా.. అసలు విషయం పక్కకు వెళ్లిపోయి.. ఆయన్ను కస్టడీలో పోలీసులు కొట్టారా? లేదా? అనే అంశం హైలైట్ అయింది. దీనిపై సీల్డ్ కవర్ లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన్ను సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఇక్కడో ఆసక్తికర సంఘటన జరిగింది. రఘురామ మళ్లీ మీసం మెలేశారు. ఇటివల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యల సందర్బంలో మీసం మెలేశారు. ఇప్పడు మళ్లీ హైదరాబాద్ వెళ్తూ మీసం మెలేశారు.
రఘురామకృష్ణ రాజును హైదరాబాద్కు తరలిస్తున్న సందర్భంలో ఆయన కారులో ఉన్నంత సేపు తన మీసంపై చేయి ఉంచారు. పలు సందర్భాల్లో మీడియా కెమెరాలు కనిపించగానే మీసాన్ని తిప్పుతూనే కనిపించారు. ఇదే ఇప్పుడు ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. రఘురామ మళ్లీ ఇలా మీసం మెలేయడం వెనక ఉద్దేశం ఏంటనే ఊహాగానాలు వస్తున్నాయి. గుంటూరు జీజీహెచ్ నుంచి రమేశ్ హాస్పిటల్ కు కాకుండా జైలుకు తరలించారు. అనేక పరిణామాల అనంతరం సుప్రీంకోర్టు ఆయన్ను ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. సీఐడీ అధికారులు తనను బలవంతంగా జైలుకు పంపాలన్నా సాధ్యం కాలేదన్న ఉద్దేశంతోనే ఇలా చేశారా.. లేక తాను నైతిక విజయం సాధించాననే సంకేతమా అనేది ప్రశ్నార్ధకంగా మారింది.
ప్రస్తుత చర్యలతో తాను బలహీనపడలేదని.. తాను ధైర్యవంతుడినని చెప్పడం కూడా ఆయన ఉద్దేశమై ఉంటుందని చెప్పాలి. అయితే.. రఘురామ కాలికి గాయాల అంశం ఆర్మీ ఆసుపత్రి ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా సుప్రీంకోర్టులో తేలిపోతుంది. కానీ.. ఈ సమయంలో ఆయన సంపాదించాల్సిన నైతిక మద్దతు మాత్రం ఏవైపు నుంచీ దక్కదనే చెప్పాలి. ఇలా చేయడం వల్ల రఘురామ ప్రభుత్వంపై, కులాలపై కావాలనే వ్యాఖ్యలు చేశారా? అనే అనుమానాల్ని రేకెత్తించడమే అవుతుంది. సుప్రీం ఆదేశాల మేరకు ఆర్మీ ఆసుపత్రిలో కట్టుదిట్టమైన భద్రత, ఏర్పాట్ల మధ్య ఆయనకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.