1971లో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భారీ స్థాయిలో కొత్త ఎన్నికల వాగ్దానం బయటపెట్టారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన పక్షంలో దేశంలోని పేదలందరికీ కనీస ఆదాయం కల్పిస్తామని ఆయన ప్రకటించారు. చండీగఢ్లో సోమవారం ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు.
దేశంలో ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ ఈ చర్య చేపట్టలేదనీ, మొదటి సారిగా కాంగ్రెస్ పార్టీ ఈ బృహత్తర కార్యక్రమం చేపడుతోందనీ ఆయన అన్నారు. ‘మా ప్రభుత్వం ఈ కార్యక్రమం చత్తీస్గఢ్లో చేపడుతుంది, మధ్యప్రదేశ్లో చేపడుతుంది, అలాగే రాజస్థాన్లో…ప్రతి రాష్ట్రంలో చేపడుతుంది. మేము రెండు ఇండియాలు ఉండాలను కోవడం లేదు. మాకు కావాల్సింది ఒకే ఇండియా’, అన్నారు రాహుల్.
రాహుల్ గాంధీ నానమ్మ ఇందిరా గాంధీ గతంలో ఒకసారి గరీబీ హటావో నినాదం ఇచ్చారు. 1971 సార్వత్రిక ఎన్నికల రంగంలోకి ఆమె గరీబీ హటావో నినాదంతో అడుగుపెట్టారు. సిండికేట్గా పేరు పొందిన పాతతరం కాంగ్రెస్ నాయకుల పట్టును సవాలు చేసి పార్టీని చీల్చిన ఇందిరా గాంధీకి ఆ తర్వాత అవి మొదటి ఎన్నికలు. గరీబీ హటావో నినాదం ఆమెకు ఆ ఎన్నికలలో భారీ మెజారిటీ సాధించి పెట్టింది.
ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గ్రామీణ ప్రాంతాల ఆర్ధిక వ్యవస్థపై, రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలపై దృష్టి సారించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాలలో అధికారం కైవసం చేసుకుంది.
రాహుల్ బయటకు తీసిన ఈ అస్త్రంపై బిజెపి వెంటనే స్పందించింది. రానున్న మూడేళ్లలో దేశంలో పేదరికం అన్నది లేకుండా చేయడం లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని మానవవనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పేర్కొన్నారు.
రాహుల్ ప్రసంగం వీడియో:
LIVE: Congress President @RahulGandhi addresses Kisan Rally in Naya Raipur, Chhattisgarh. #जो_कहा_सो_किया https://t.co/3DA2AuhKET
— Congress (@INCIndia) January 28, 2019