భారత్ జోడో యాత్ర పేరుతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్నపాదయాత్ర ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న సంగతి తెలిసింది. కేరళ, తమిళనాడు పూర్తి చేసుకుని కర్ణాటకలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. రాహుల్ యాత్రకు ప్రజల నుండి రెస్పాన్స్ బాగా వస్తుండటంతో ఆ పార్టీ నేతల్లో జోష్ నింపుతోంది. రాహుల్ యాత్ర ఏపికి ఈ నెల 17వ తేదీకి చేరుకోనున్నది. కర్ణాటకలో యాత్ర పూర్తి అయిన తరువాత కర్నూలు జిల్లా నుండి రాహుల్ యాత్ర ఏపికి ఎంటర్ కానున్నది. ఈ నేపథ్యంలో ఏపిలో జోడో యాత్ర ను సక్సెస్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవేళ కర్నూలులో సన్నాహక సమావేశం జరుపుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు జాతీయ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, ఉమేష్ చాందీ, కొప్పుల రాజులు ఇప్పటికే కర్నూలు చేరుకున్నారు.
ఏపిలో అయిదు రోజులు
రాహుల్ పాదయాత్ర ఈ నెల 17వ తేదీ నుండి అయిదు రోజుల పాటు జరగనుంది. అయితే ఈ జోడో యాత్ర అయిదు రోజులు ఎక్కడి నుండి ఎలా ముందుకు వెళ్లాలి.. రూట్ మ్యాప్ .. ఏ నియోజకవర్గాల మీదుగా వెళ్లాలి అనే దానిపై ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే క్రమంలో రాహుల్ జోడో యాత్రకు పోలీసుల అనుమతి కూడా కోరనున్నారు. జోడో యాత్రలో ఏర్పాట్లు, ఎవరెవరు ఏ కార్యక్రమాలు పర్యవేక్షించాలి అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు సాకే సైలజానాథ్, సీనియర్ నేతలు తులసిరెడ్డి తదితరులు పాల్గొంటారు. రాహుల్ జోడో యాత్ర ఏపిలో పూర్తి అయిన తర్వాత ఈ నెల 24వ తేదీన తెలంగాణలోకి ప్రవేశించనుంది. తెలంగాణలో ఎన్ని రోజులు పర్యటన చేయాలి, రోడ్ మ్యాప్ ఇప్పటికే ఖరారు అయ్యింది. ఈ నెల 24వ తేదీ నుండి 13 రోజుల పాటు తెలంగాణలో జోడో యాత్ర సాగనుంది.