నూతన వ్యవసాయ చట్టాలపై తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీ శివారులో పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు గత 14 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. రైతు సంఘాల పిలుపుతో నిన్న జరిగిన దేశ వ్యాప్త బంద్కు అనూహ్య స్పందన లభించి విజయవంతం అయ్యింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు బుధవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిశాయి. దేశ వ్యాప్తంగా రైతుల నుండి వ్యక్తం అవుతున్న నిరసనను వారు రాష్ట్రపతి దృష్టికి తీసుకువచ్చి, ఈ చట్టాలను రద్దు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రపతికి వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనను పరిశీలిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారని వారు తెలిపారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం చాలా ముఖ్యమని తెలిపామన్నారు. రైతులతో చర్చించకుండా, సంప్రదించకుండా ఈ బిల్లులను ఆమోదించారన్నారు. రైతులకు ఈ ప్రభుత్వంపై నమ్మకం పోయిందని అన్నారు.
సీపీఎం సీనియర్ నేత సీతారామ్ ఏచూరి మాట్లాడుతూ నూతన వ్యవసాయ చట్టాలను, ఎలక్ట్రిసిటీ అమెండ్ మెంట్ బిల్లును రద్దు చేయాలని తాము కోరామన్నారు. ఎన్ సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ మాట్లాడుతూ నూతన వ్యవసాయ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించాలని తాము కోరినప్పటికీ ఈ బిల్లులను ఆత్తుతగా ఆమోదించారని పేర్కొన్నారు.
మరో పక్క కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ నెల 14వ తేదీన దేశ వ్యాప్త ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి. సీపీఐ నేత రాజా తదితరులు రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు.