రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణించేవారిపై జరిమానా విధిస్తారన్న సంగతి తెలిసిందే. రూ.250 జరిమానాతోపాటు టిక్కెట్ ఖరీదును చెల్లించాల్సి ఉంటుంది.
నిరాకరిస్తే 6 నెలల వరకు జైలు శిక్ష లేదా రూ.1వేయి జరిమానా పడుతుంది. అయితే ఇంత తెలిసి కూడా ఏటా కోట్ల మంది రైళ్లలో టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్నారు. దీంతో రైల్వే శాఖ వారికి జరిమానా విధిస్తోంది. ఈ క్రమంలో రైల్వేకు ఏటా రూ.వందల కోట్లలో ఆదాయం వస్తోంది. 2019-20 సంవత్సరానికి గాను రైల్వేకు ఇలా టిక్కెట్ లేకుండా ప్రయాణించిన వారిపై విధించిన జరిమానాల వల్ల మొత్తం రూ.561.73 కోట్లు ఆదాయం వచ్చింది.
మధ్యప్రదేశ్కు చెందిన సామాజిక కార్యకర్త చంద్ర శేఖర్ గౌర్ తాజాగా ఆర్టీఐ ద్వారా ఆయా వివరాలను సేకరించారు. దీంతో వెల్లడైందేమిటంటే.. 2016 నుంచి 2020 మధ్య టిక్కెట్ లేని ప్రయాణికులపై విధించిన జరిమానాల వల్ల రైల్వేకు రూ.1938 కోట్ల ఆదాయం వచ్చింది. 2016 నుంచి 2020 వరకు ఆ ఆదాయం 38.57 శాతం పెరిగింది.
2016-17 మధ్య రైల్వేకు టిక్కెట్ లేని ప్రయాణికుల వల్ల రూ.405.30 కోట్ల ఆదాయం వచ్చింది. 2017-18లో రూ.441.62 కోట్లు, 2018-19లో రూ.530.06 కోట్ల ఆదాయం వచ్చింది. ఇక 2019-20లో రూ.561.73 కోట్ల ఆదాయం వచ్చింది. 2019-20 సంవత్సరంలో మొత్తం 1.10 కోట్ల మంది ప్రయాణికులు టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తూ పట్టుబడి జరిమానాలు కట్టారు.అయినప్పటికీ టిక్కెట్ లేకుండా రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ఇక ఇందుకు గాను టీటీఈలకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. వారు రైళ్లలో టిక్కెట్ లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి ఫైన్లు వసూలు చేయాలి. అందుకు గాను టీటీఈలకు ఇప్పటికే నెల నెలా రైల్వే శాఖ టార్గెట్లు విధించింది. అయితే అలాంటి ప్రయాణికుల వల్ల ఇంత పెద్ద మొత్తంలో రైల్వే శాఖకు ఆదాయం రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.