(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
గత నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. ఈ నష్టం నుండి తేరుకోకముందే మళ్లీ నేడు రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఏపిలో రానున్న నాలుగైదు గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది.
ఐఎండి వాతావరణ సూచనల ప్రకారం గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే విధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కె కన్నబాబు సూచించారు.
గత నెలలో కురిసిన వర్షాలకు రాష్ట్రంలో పంట నష్టం అంచనాకు రెండు రోజుల క్రితమే కేంద్ర బృందం వచ్చింది. రెండు రోజుల పాటు కేంద్ర బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితోనూ కేంద్ర బృందం సమావేశమైంది.