(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటరు ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో శుక్ర, శనివారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో పత్తి, మక్క, అపరాల పంటలకు నష్టం వాటిల్లింది. ఇక తెలంగాణలో ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, మంచిర్యాల, మహబూబాబాద్తోపాటు గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
Finally rains are likely to decrease from early next week in both the Telugu states. pic.twitter.com/awlW15XEsq
— AP and TS Weatherman (@Weather_AP) October 24, 2019
మరోవైపు కర్ణాటకలో వర్షాలు తగ్గక పోవడంతో కృష్ణానదిలో వరద కొనసాగుతోంది. వరద 5 లక్షల క్యూసెక్కులకు పైగానే కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కు క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. నిన్నటివరకూ నాగార్జున సాగర్ 12 గేట్లను 15 అడుగుల మేరకు తెరచివుంచిన అధికారులు, ఇవాళ 18 గేట్లను 20 అడుగుల మేరకు తెరిచారు. నాగార్జున సాగర్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 589 అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, 309 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుతానికి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువకు విడుదల చేస్తున్నామని, వరద నీటి ప్రవాహం తగ్గితే, కొన్ని గేట్లను దించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. కృష్ణలో వరద నీటి ప్రవాహం పెరగడంతో, ప్రకాశం బ్యారేజ్ దిగువన అధికారులు అప్రమత్తం అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో ఉన్నారు.