శ్రీకాకుళం: ఫోని పెను తుఫాను ప్రభావం మొదలయ్యింది. శ్రీకాకుళం జిల్లాలోని సముద్రతీర మండలాల్లో పరిస్థితులు మారుతున్నాయి, పలాస, టెక్కలి, సంతబొమ్మాలి, శ్రీకాకుళంలో వర్షం కురుస్తోంది. సముద్ర తీర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడుతున్నాయి. ఇచ్చాపురం సహా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లు రద్దయ్యాయి. తూర్పు కొస్తా రైల్వే పరిధిలో 103 రైళ్లను అధికారులు రద్దు చేశారు.
తుఫాను పునరావాస కేంద్రాల్లో పరిస్థితులను కలెక్టర్ నివాస్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు.
ఇచ్చాపురం, సోంపేట, కవిటి, పలాస, మందస, టెక్కలి, కొత్తూరు, భామిలి, శ్రీకాకుళంలో తొమ్మిది ఎన్డిఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. అగ్నిమాపక శాఖ బృందాలను, తుఫాను ప్రభావిత మండలాల్లో ఐదు జెసిబిలను కూడా సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తూ ఉన్నతాధికారులకు నివేదికలు ఇస్తున్నారు.
ఫొని తుఫాను సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా 1100కు ఫోన్ చేయాలని రియల్ టైమ్ గవర్నెస్ సొసైటి (ఆర్టిజిఎస్) అధికారి బాబు ఎ సూచించారు.
తుఫాను పర్యవేక్షణ పరిష్కార వేదికలో ఆర్టిజిఎస్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎప్పటికప్పుడు సర్వైలెన్స్ కెమెరాల ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలను ఆర్టిజిఎస్ పర్యవేక్షిస్తోంది.
శ్రీకాకుళం తీర ప్రాంత మండలాల్లో గంటకు 120నుండి 130 కిలో మీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తాయని ఆర్టిజీఎస్ పేర్కొంది. విజయనగరం తీర ప్రాంత మండలాల్లో గంటకు 90నుండి 110 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. గురువారం అర్థరాత్రి నుండి శుక్రవారం తెల్లవారుజాము వరకూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై ఫొని తుఫాను ప్రభావం ఉంటుందని తెలియజేసింది. అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.