కోల్కతా: కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్కు ఇబ్బందులు పెరిగిపోయాయి. శారదా చిట్ ఫండ్ కుంభకోణంలో కేసులో సాక్ష్యాలను మాయం చేశారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న రాజీవ్ కుమార్ ఇతర దేశాలకు పరారు కాకుండా సిబిఐ లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. సంవత్సరం పాటు ఆయనపై ఆంక్షలు విధిస్తున్నట్లు సిబిఐ ప్రకటించింది.
శారదా కుంభకోణం దర్యాప్తు వ్యవహారంపై ఇటీవల సుప్రీం కోర్టును సిబిఐ అధికారులు ఆశ్రయించారు. దర్యాప్తునకు రాజీవ్ కుమార్ సహకరించడం లేదనీ, సాక్షాలను మరుగుపర్చేందుకు చూస్తున్నారని సిపిఐ ఆరోపించింది. సిబిఐ పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం రాజీవ్ కుమార్ను విచారణకు సహకరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేయకుండా మధ్యంతర రక్షణ కల్పిస్తూ ఫిబ్రవరి అయిదున ఆదేశం ఇచ్చింది. అరెస్టు మినహాయింపు గడువు మే 24తో ముగిసింది. అంతకు ముందు కోర్టు సూచనలతో షిల్లాంగ్లో ఆయనను సిబిఐ అధికారులు విచారించిన విషయం విదితమే. పశ్చిమ బెంగాలలో న్యాయవాదుల సమ్మె జరుగుతున్నందున అరెస్టు నుండి మినహాయింపు గడువు పెంచాలని రాజీవ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రాజీవ్ కుమార్ను కస్టడీలోకి తీసుకొని విచారణ చేయాలని సిబిఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాజీవ్ కుమార్ దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు లుక్అవుట్ నోటీసులను సిబిఐ జారీ చేసింది.
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బెంగాల్లో అమిత్షా నిర్వహించిన ప్రచార ర్యాలీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో రాజీవ్ కుమార్ను ఎన్నికల కమిషన్ బెంగాల్ సిఐడి ఎడిజీగా తొలగించింది. ప్రస్తుతం ఆయన కేంద్ర హోంశాఖలో విధులు నిర్వహిస్తున్నారు