Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు పార్టీలో చేరారు. రాజోలు నియోజకవర్గ వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావుతో సహా పలువురు నేతలు ఆదివారం మంగళగిరి పార్టీ కార్యాలయం జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంలో రాజేశ్వరరావు వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో మొదటి నుండి ఉన్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కష్టపడిన కార్యకర్తలపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూడున్నర సంవత్సరాలుగా రాష్టంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయన్నారు. ఏపిలో దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. హత్య కేసులో వైసీపీ ఎమెల్సీకి బెయిల్ వచ్చింది కానీ కోడికత్తి కేసు నిందితుడు ఇంకా జైలులోనే మగ్గిపోతున్నాడని అన్నారు.
బొంతు రాజేశ్వరరావు 2014, 2019 ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గం నుండి వైసీపీ తరపున పోటీ చేసి పరాజయం పాలైయ్యారు. గత ఎన్నికల్లో రాజేశ్వరరావుపై కేవలం 800 ఓట్ల ఆధిక్యతతో జనసేన తరపున పోటీ చేసి విజయం సాధించిన రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున రాపాక వరప్రసాద్ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ వైసీపీలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అధిపత్యం పెరగడంతో రాజేశ్వరరావు అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆయన వర్గీయులతో జనసేన పార్టీలో చేరారు.