రాజ్యసభ ఎన్నికల ఫలితాల సంగతేమో కానీ… ఆ ఎన్నికల్లో పోటీచేయడం వల్ల చంద్రబాబుకు చాలా విషయాలపైనే క్లారిటీలు వచ్చాయి. పైగా టీడీపీ నేతలు చెబుతున్నట్లుగా… ఓడిపోయే ఎన్నికల్లో కూడా ఎందుకు పోటీ చేశారంటే… ఆ ముగ్గురు రెబల్స్ సంగతి ఏమిటో తెలుసుకోవడానికి అని! కానీ… బాబుకు తెలిసింది ఆ ముగ్గురు రెబల్స్ గురించే కాదు.. ఎప్పుడు గోడదూకేస్తారో తెలియని మరికొందరు నేతల మీద కూడా వచ్చింది! ఎన్నికల ఫలితాలు వచ్చే సరికి 23 ఉండగా, రాజ్యసభ ఎన్నికల సమయానికి 17 అయ్యాయి!
ఎందుకు నెగిటివ్ గా ఆలోచించడం అని… అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, పొరపాటు జరిగిందన్న ఆదిరెడ్డి భవానీలను కూడా కలిపేసుకుంటే.. లెక్క 20! కీడెంచి మేలెంచాలనే లెక్కలు వేస్తే మళ్లీ లెక్క తప్పుతుంది కాబట్టి ప్రస్తుతానికి ఆ రిస్క్ వద్దు! అయితే… ఈ ఎన్నికల వల్ల బాబుకు వచ్చిన మరో క్లారిటీ… సైలంట్ గా ఉన్న కొందరు ఎమ్మెల్యేల్లు సైకిల్ దిగిపోతున్నారంటూ వస్తున్న గాసిప్పులపై క్లారిటీ. అందులో ముందుగా చెప్పుకునే పేరు.. గంటా శ్రీనివాస రావు! అదిగో వెళ్లిపోతున్నాడు, ఇదిగో వెళ్లిపోతున్నాడు అంటూ రోజు రోజుకీ పెరిగిపోతున్న వార్తల నేపథ్యంలో… మొన్న ఆన్ లైన్ మహానాడుకు హాజరైన గంటా.. తాజాగా రాజ్యసభ ఎన్నికల్లోనూ టీడీపీకే ఓటు వేశారు. అదే జిల్లాకు చెందిన గణబాబు కూడా పార్టీలోనే ఉంటున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
దీంతో చంద్రబాబు ధైర్యం 20 దగ్గర ఆగినట్లయ్యింది. ఇంతటి వైసీపీ దూకుడులో కూడా టీడీపీలో వైపు ఇంతమంది ఎమ్మెల్యేలు నిలబడడం అంటే అది టీడీపీకి బలమేనని అంటున్నారు విశ్లేషకులు. టీడీపీ క్యాడర్ బలము, బాబు రాజకీయ చాణక్యమే దీనికి కారణం అని అంటున్నారు. ఈ లెక్కన చూసుకుంటే.. ఇప్పుడు ఉన్న వారు చివరి వరకూ ఉన్నా కూడా ప్రతిపక్ష హోదాకు వచ్చిన భంగం ఏమీ లేదు! కానీ… రాజకీయాల్లో అన్ని రోజులూ ఒకేలా ఉండవు కాబట్టి… మరో ముగ్గురు గనుక తప్పితే మాత్రం… బాబు పరిస్థితి వర్ణనాతీతం అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు పరిశీలకులు!