కోర్టులిచ్చే కొన్ని తీర్పులు సంచలనం అవుతాయి. మరి కొన్ని సమాజానికి మార్గదర్శకమవుతాయి.ఇండోర్ కోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఇటు సంచలనం రేపింది.అటు సమాజాన్ని ఆకట్టుకుంది.
వివరాల్లోకి వెళితే ఒక వివాహితను వేధించాడన్న కేసులో అరెస్టయిన ఒక వ్యక్తిని అదే మహిళ చేతితో రక్షాబంధన్ రోజు రాఖీ కట్టించుకుని ఆమెకు కానుకగా పదకొండు వేల రూపాయలు ఇవ్వాలని ఇండోర్ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది.ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరంలో జరిగి౦ది..ఉజ్జయిని నగరానికి చెందిన విక్రమ్ బాగ్రి 30 ఏళ్ల వివాహిత ఇంట్లోకి ప్రవేశించి వేధించాడని పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.
పోలీసులు నిందితుడైన విక్రమ్ బాగ్రిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.నిందితుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో బాగ్రికి రూ.50వేల వ్యక్తిగత పూచికత్తుపై ఇండోర్ కోర్టు వేలు మంజూరు చేసింది.ఇదేమి వార్త కాదు. కోర్టుల్లో రొటీనుగా జరిగేదే.అయితే ఇక్కడ బెయిలు మంజూరు చేయడానికి న్యాయమూర్తి పెట్టిన ఒక షరతే ప్రధాన వార్తగా రూపుదిద్దుకుంది.
న్యాయమూర్తి జస్టిస్ రోహిత్ ఆర్య నిందితునికి షరతులతో కూడిన బెయిలు ఇస్తూ రక్షాబంధన్ సందర్భంగా సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 3వతేదీన 11 గంటలకు నిందితుడు తన భార్యతో కలిసి బాధిత వివాహిత ఇంటికి స్వీటు బాక్సుతో వెళ్లి, ఆమెతో రాఖీ కట్టించుకొని భవిష్యత్తులో ఆమెకు రక్షణగా ఉంటానని వాగ్ధానం చేసి, రూ.11వేలు ఇవ్వాలని జడ్జి ఆదేశించారు.
బాధితురాలి కుమారుడికి రూ.5వేలతో బట్టలు, స్వీట్లు కొని ఇచ్చి, బాధిత వివాహిత ఆశీర్వాదం పొందాలని నిందితుడు బాగ్రిని జడ్జి ఆదేశించారు. నిందితుల్లో పరివర్తన తేవడానికి జైలుశిక్షలే అక్కర్లేదు!వారిలో కూడా మార్పు తెచ్చే ఇలాంటి చర్యలు తీసుకున్నా సమాజం బాగుపడుతుందనడంలో సందేహం లేదు.