అమరావతి, ఏప్రిల్ 7: ఎన్నికల ప్రచారంలో బాబాయి పవన్ కళ్యాణ్కు బాసటగా నిలిచేందుకు ప్రముఖ సినీ హీరో రామ్ చరణ్ తేజ్ సిద్ధం అయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో విస్తృతంగా తిరుగుతూ శుక్రవారం రాత్రి వడదెబ్బ కారణంగా స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రచార ప్రచార పర్వానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో రెండు రోజుల పాటు రామ్ చరణ్ తేజ్ ఇక్కడే ఉండి ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తుంది. జనసేన తరపున చెర్రీ ప్రచారంలో పాల్గొంటున్నారని తెలియడంతో జనసైనికులు, మెగా బ్రదర్స్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్యాడర్లో మరింత ఉత్తేజం వస్తుందని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నారు. రామ్చరణ్ ఇప్పటికే పవన్ కళ్యాణ్ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం విశాఖ జిల్లా అనకాపల్లి, పెందుర్తిలో జరిగే ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభల్లో పవన్ కలిసి చెర్రీ కూడా పాల్గొని కార్యకర్తల్లో నూతనోత్సాహన్ని నింపుతారని భావిస్తున్నారు.
ఇప్పటికే బాబాయి పవన్ కళ్యాణ్ కోసం చెర్రీ ప్రత్యేకంగా జనసేన పార్టీకి వీడియో పాటను రూపొందించి బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే.