Ram Charan: ఒకప్పుడు రాజకీయ నాయకుల పాదయాత్రల సీజన్ నడిచింది.డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తో మొదలైన ఈ ఫార్ములా ఆయన కుమారుడు జగన్ వరకు కొనసాగింది. మధ్యలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు,జగన్ సోదరి షర్మిల కూడా పాదయాత్రలు సాగించారు.షర్మిల మినహాయిస్తే మిగిలిన అందరూ అందలం అందుకున్నారు.షర్మిల ఇప్పుడు తెలంగాణలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇది గతమైతే ఇప్పుడు సినీ హీరోల అభిమానుల పాదయాత్రల సీజన్ మొదలైంది.నిన్నగాక మొన్న కరోనా దేవుడు సోనూసూద్ ను కలుసుకోవడం కోసం హైద్రాబాద్ నుండి వెంకటేష్ అనే ఆయన అభిమాని ఏడు వందల కిలోమీటర్లు నడుచుకుంటూ బొంబాయి వెళ్లిన విషయం గుర్తుండే ఉంటుంది.సోనూసూద్ ఆ వీరాభిమానికి సాదర స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చి పంపిన విషయం తెలిసిందే.బహుశా ఇదే ప్రేరణగా పనిచేసిందేమో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ ఫార్ములానే ఫాలో అయిపోయి తమ అభిమాన నటుడ్ని కలుసుకున్నారు.
అసలేం జరిగిందంటే!
తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాకి చెందిన ముగ్గురు రామ్ చరణ్ వీరాభిమానులు మెగా పవర్ స్టార్ ని కలుసుకోవడానికి హైద్రాబాద్ కు పాదయాత్ర సాగించారు.సంధ్యా జయరాజ్ ,రవి,వీరేష్ లనే ఈ ముగ్గురు ఫ్యాన్స్ తమ ఊరి నుండి 231కిలో మీటర్లు నడిచి హైదరాబాద్ కి చేరుకున్నారు.ఇందుకు వీరికి నాలుగు రోజుల సమయం పట్టిందట.ఇంతగా కష్టపడి తనను కలుసుకోవడానికి వచ్చిన ఆ ముగ్గురు అభిమానులను చూసి రామ్ చరణ్ ముగ్ధుడైపోయాడు.వారికి అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా సుమారు గంటసేపు వారితో గడిపారు. నిజానికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కావడంతో రామ్ చరణ్ చాలా బిజీగా ఉన్నప్పటికీ వారికి ఎక్కువ సమయం కేటాయించారు.ఆ ముగ్గురికీ ఆయన అద్భుతమైన ఆతిథ్యమిచ్చారట.అందరితో ఫొటోలు దిగారు.జీవితంలో స్థిరపడ్డానికి తనవంతు సాయం అందిస్తానని కూడా వారికి రామ్ చరణ్ అభయమిచ్చారు.వారిలో ఒక అభిమానిని రామ్ చరణ్ కౌగలించుకున్న ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.దీంతో తమ జీవితం ధన్యమైపోయిందని ఆ ముగ్గురు అభిమానులు హర్షాతిరేకంతో తమ ఇళ్లకు తిరుగుముఖం పట్టారు .