విజయవాడ, ఏప్రిల్ 28: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఆదివారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు.
మే 1వ తేదీన విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టిఆరం సినిమాకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు ఆదివారం విజయవాడ నోవాటెల్ హోటల్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అయితే హోటల్ యాజమాన్యం ఆయన కార్యక్రమానికి అనుమతి నిరాకరించి ఆయన బుకింగ్ను రద్దు చేశారు.
అదివారం గన్నవరం ఎయిర్ పోర్టులో విమానం దిగిన రాంగోపాల్ వర్మ కారులో బయలు దేరగా విజయవాడలోని ప్రకాశ్ నగర్ వద్ద వర్మ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ‘విజయవాడలోకి మిమ్మల్ని అనుమతించలేం. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దయచేసి వెనక్కి వెళ్లిపోండి’ అని కోరారు.
హోటల్లో బుకింగ్ రద్దు చేయడం వల్ల ఎన్టిఆర్ సర్కిల్ వద్ద రోడ్డుపై మీడియా సమావేశం నిర్వహిస్తానని వర్మ హెచ్చరించారు. వర్మ సమావేశం ఏర్పాటు చేస్తే టిడిపి వర్గాలు అడ్డుకునే అవకాశం ఉందనీ, దీని వల్ల గొడవలు జరగవచ్చని పోలీసులు భావించారు. వర్మకు ఒక పోలీస్ వాహనాన్ని ఎస్కార్డ్గా ఇచ్చి బలవంతంగా గన్నవరం ఎయిర్ పోర్టుకు తిప్పిపంపారు.
ఈ సందర్భంగా వర్మ ట్విట్టర్ ద్వారా వీడియో పోస్టు చేశారు. బలవంతంగా తనను గన్నవరం ఎయిర్ పోర్టుకు తరలించారనీ, ప్రస్తుతం తాను పోలీస్ కస్టడీలోనే ఉన్నాననీ వర్మ వాపోయారు. తాను నిజం చెప్పాను కాబట్టే పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కనుమరుగైపోయిందని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విజయవాడ పోలీసు అధికారుల వివరణ
I am In police custody now for the only crime of trying to tell truth ..THERE IS NO DEMOCRACY IN ANDHRA PRADESH pic.twitter.com/O7OnWop407
— Ram Gopal Varma (@RGVzoomin) April 28, 2019