రమణ దీక్షితులు…టీటీడీ గౌరవ ప్రధానార్చకులు. గత కొంతకాలంగా సంచలన కామెంట్లు, ట్వీట్లతో వార్తల్లో నిలుస్తున్న వ్యక్తి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)
పనితీరుపై విమర్శలు చేసిన నేపథ్యంలో దాదాపు రెండేళ్ల క్రితం రమణ దీక్షితులుపై వేటు పడిన విషయం తెలిసిందే. అయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనను మళ్లీ ప్రధాన అర్చకులుగా టీటీడీ నియమించింది. కానీ తనకు వారసత్వ అర్చక పదవి కావాలని రమణ దీక్షితులు కోరుతున్నారు. ఈ క్రమంలో టీటీడీపై రమణ దీక్షితులు పలు ట్వీట్లు, కామెంట్లు చేశారు.
ఇంతకీ ఏమన్నారంటే…
ఎప్పుడు సంచలనాలతో వార్తల్లోకి ఎక్కే టీటీడీ ప్రధాన పూజారి రమణ దీక్షీతులు తాజాగా మరోసారి హాట్ టాఫిక్ గా మారారు. ఎప్పట్లాగే రమణ దీక్షితులు మరో సంచలన ట్వీట్ చేశారు. ` వైఎస్ జగన్ గారు నన్ను వంశపారంపర్య అర్చుకుడిగా బాధ్యతలు చేపట్టమన్నారు. కానీ టీటీడీ మాత్రం ముఖ్యమంత్రి ఆదేశాలను పట్టించుకోకుండా నన్ను గౌరవ ప్రధాన అర్చకుడి పదవిని ఇచ్చింది. దీన్ని నేను తిరస్కరించాను. సీఎం గారు దీనిపై మీరు ఆదేశాలు జారీ చేయండి. అర్చకులు ఎదురుచూస్తున్నారు“ అని రమణ దీక్షితులు ట్వీట్ చేశారు. అయితే కాసేపటికే ఆయన మళ్లీ ఆ ట్వీట్ని డిలీట్ చేయడం ఇందులో అసలు ట్విస్ట్.
ఇప్పుడు ఇదేం ట్వీట్ అంటే…
తిరుమల గౌరవ ప్రధాన అర్చకుడిగా గౌరవం పొందిన రమణ దీక్షితులు అనంతరం తన అభిప్రాయాలను ఒకింత కఠినంగా, హెచ్చరిక స్వరంలోనే ఏపీ సర్కారుకు వినిపించారు. అర్చకుల రక్షణ విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పూర్తిగా విఫలమైందని ట్విట్టర్ ద్వారా సీఎం వైఎస్ జగన్ కు తెలిపారు. అంతేకాదు కన్నుమూసిన అర్చకుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలంటూ విజ్ణప్తి చేశారు. అక్రమంగా పదవీ విరమణకు గురైన మాజీ ప్రధాన అర్చకుడు ఒకరు వంశపారంపర్య సేవలను పునరుద్ధరించాలని పోరాడుతూ మరణించారని చెప్పారు. మరో 45 ఏళ్ల జూనియర్ అర్చకుడు స్వామికి సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. వీరిని కాపాడడంలో టీటీడీ విఫలమైందని మండిపడ్డారు. ఈ ట్వీట్కు వైఎస్ జగన్, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అకౌంట్లను ఆయన ట్యాగ్ చేశారు.
అప్పుడు ఎంత దూకుడుగా ఉండేవారంటే…
కాగా, చార్దామ్ సహా 54 దేవాలయాలను రాష్ట్ర పరిధి నుంచి తప్పించాలన్న.. పిటిషన్పై తీర్పు రిజర్వులో ఉందంటూ సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి కృషిని తిరుమల శ్రీవారి గౌరవ ప్రధానార్ఛకులు రమణ దీక్షితులు అభినందించారు. శ్రీవారి ఆలయంలపై సుబ్రహ్మణ్యస్వామి చేసిన ట్వీట్కు రమణ దీక్షితులు సమాదానం ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానాలు త్వరలో ప్రభుత్వ నియంత్రణ నుండి విముక్తి పొందటానికి అనేక ఇతర దేవాలయాలను అనుసరిస్తాయని సుబ్రహ్మణ్య స్వామి సందేశాన్ని రమణ దీక్షితులు స్వాగతించారు. దీని స్వాగతించిన రమణ దీక్షితులు ఉత్తరాఖండ్ లాగా త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి తిరుమలకు విముక్తి లభించనుందని ఆయన పేర్కొన్నారు. ఇది సనాతన ధర్మ విజయంగా భావిస్తున్నట్టు రమణ దీక్షితులు ట్వీట్ చేశారు.
దీక్షితులు గారు దిగివచ్చినట్లేగా?
కట్ చేస్తే అంతటి ఆగ్రహ స్వరం నుంచి రమణ దీక్షీతులు ఇప్పుడు ఒకింత తగ్గారు. గతంలో దీక్షితులు కామెంట్లను ఏపీ ప్రభుత్వం మాత్రం పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. దీంతో ఒకింత మెట్టు దిగిన రమణ దీక్షితులు తాజాగా స్వరం తగ్గించి స్పందించారు. తనను బాధ్యతలు చేపట్టమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించినా.. టీటీడీ తనను గౌరవ ప్రధానార్చకుడిగా మాత్రమే ప్రతిపాదించిందని ఆయన వెల్లడించారు. ఈ కామెంట్స్ ప్రస్తుతం సంచలనంగా మారాయి. అయితే,దీక్షితులు గారు దిగి వచ్చినందున ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆయన్ను కనికరిస్తారా వేచి చూడాల్సిందే.