ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. మొన్న రామతీర్థంలో రామయ్య విగ్రహం ధ్వంసం జరిగితే..నేడు విజయవాడలో సీతమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దుండగులు. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఉన్న..శ్రీసీతారామ మందిరంపై దాడికి పాల్పడ్డారు.
దేవాలయానికి తాళం వేసి ఉన్నా..కొబ్బరి బోండాలతో విగ్రహాలను కొట్టారు. ఈ దాడిలో సీతాదేవి విగ్రహం ధ్వంసమైంది. అటు.. విషయం తెలిసిన వెంటనే టీడీపీ నేతలు శ్రీసీతారామ మందిరానికి చేరుకున్నారు. సీతాదేవి విగ్రహం ధ్వంసం ఘటనపై విచారణ జరపాలన్న టీడీపీ నేత పట్టాభి పోలీసులను కోరారు.
సీఐ వింత సమాధానం!
ఐతే.. ఎలుకలు లేదా గాలి ద్వారా విగ్రహం ధ్వంసమై ఉంటుందని సీఐ సత్యానందం అన్నారు. సీఐ సమాధానంపై పట్టాభి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాధ్యత గల పోలీస్ అధికారిగా నిర్లక్ష్యంగా ఇలా మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంటికి కూతవేటు దూరంలోనే ఉన్న దేవాలయంపై దాడిని ఆపలేకపోయారని టీడీపీ నేతలు మండిపడ్డారు. వెంటనే మంత్రి వెల్లంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే..ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నాయి.
రామతీర్థంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
విజయనగరం జిల్లా రామతీర్థంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆలయంపై దాడికి నిరసనగా హిందూ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. రామతీర్థంలో 21 సంఘాలు నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చాయి. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ నుంచి ధార్మిక నేతలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. శనివారం రోజు టీడీపీ అధినేత చంద్రబాబు టూర్తో.. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. హుటాహుటిన మంత్రుల్ని రంగంలోకి దింపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ నేడు రామతీర్థం బయలుదేరి వెళ్లారు. మంత్రుల పర్యటన, హిందూ సంఘాల ఆందోళన పిలుపుతో రామతీర్థంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆలయంపై దాడిని ఖండిస్తూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అటు.. రామతీర్థం ఆలయ ఛైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజు ప్రభుత్వం తొలగించింది. ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు, హిందూ సంఘాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.