రామోజీ అంటే మీడియా మొఘల్.., పేద్ద వ్యాపార సామ్రాజ్యాధినేత.., వేల కోట్ల అధిపతి.. ఇలా నిస్సంకోచంగా చెప్పుకోవచ్చు. ఆ ఘనమైన రామోజీ మరో కొత్త కంపెనీ పెట్టబోతున్నారు. ఇదేదో ఘనత కోసం కాదండోయ్.., శ్రమ దోపిడీకి, ఉద్యోగులను పీక్కు తినడానికి మాత్రమే.
రామోజీ చీకటి ఆలోచనలు.., కడుపులు కొట్టే సంస్కృతి చాలా వరకు తెలియదు. కరోనా ఆరంభం నుండీ ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కరోనా పేరు చెప్పి 1000కి పైగా ఉద్యోగులను రోడ్డున పడేశారు. ప్రభుత్వాల దగ్గర మాత్రం డబ్బులు/ డబ్బాలు కొడుతున్నారు/ కొట్టించుకుంటారు. దసరా పుణ్యామాని ఆయన మానసపుత్రిక (ఈనాడు) సంస్థలో ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. ఇంకొందరికి పొగ పెట్టారు. ఇక ఆ యాజమాన్యం తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఉద్యోగులకు మరింత షాకింగ్ గా ఉండనున్నాయి. చట్టంలో లొసుగులు వాడుకోవడంలో రామోజీని మించిన బుర్ర ఉండదు అని మరోసారి నిరూపిస్తున్నారు. దానిలో భాగంగా ఓ కొత్త కంపెనీ రాబోతుంది అన్నమాట.
అన్నీ ఆపేసి.., హక్కుల కాలరాత..!!
ఈనాడులో డెస్కు, మిషన్, యాడ్స్ ఇతర అన్ని విభాగాలు కలిపి సుమారుగా 1200 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. వీరికి ఏటా దసరాకి బోనస్ ఇచ్చేవారు. ఇప్పుడు అది లేదు. ఈ ఏడాది బోనస్ తో పాటూ.., ఎల్టీటీ (టూర్ ప్యాకేజి) కూడా నిలిపివేశారు. చట్ట ప్రకారం ఇవ్వాల్సిన ఈ సదుపాయాలను కరోనా నష్టాల పేరిట ఆపేశారు. ఈ ఏడాది మే నెల నుండి ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇవ్వాల్సింది.., ఇది ఆపేశారు. 2017 నుండి చేరుతున్న డిజిటల్ బ్యాచ్ లకు ఇప్పటికే రూ. 2 వేలు చొప్పున పెంచాల్సి ఉన్నా.., ఇది కూడా ఆపేశారు. ఇలా ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్యాకేజీలు, సదుపాయాలు ఏ మాత్రం ఇవ్వలేదు. సరే కరోనా నష్టాలు.., ఇది వారి దుర్భుద్ధి.., వదిలేద్దాం అనుకుంటే.. మరో సరికొత్త నిర్ణయంతో ఉద్యోగులపై పిడుగునకు సిద్ధమవుతున్నారు. ఈటీవీ, ఈనాడు, ఈటీవీ భారత్ వంటి అన్ని మధ్యమాలకు ఒక్కరే రిపోర్టర్ పని చేయాలట. ఇప్పటికే చేస్తున్న శ్రమ దోపిడీ చాలదు అన్నట్టు.., ఒకరికి నాలుగు బాధ్యతలు అప్పగించనున్నారు.
కొత్త కంపెనీ కిటుకు ఇదే..!!
“కరోనా కారణంగా నష్టపోయాం. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా మందిని తీసేశాం. మీరు ప్రతిభావంతులు అందుకే కొనసాగిస్తున్నాం. కానీ మీరు కంపెనీకి తోడుగా ఉండాలి, సహకరించాలి” అంటూ ఓ అభయం ఇచ్చే బిల్డప్ కొడుతూ ఆ “భయం” కలిగిస్తున్నారు. తాజాగా రీటా (యాడ్స్ విభాగం)లో తీసుకున్న ఓ నిర్ణయం షాకింగ్ కి గురి చేయడమే కాదు.., రామోజీ అతి తెలివిని నిరూపిస్తుంది. ఇప్పుడున్న చట్టం, తన సంస్థ రిజిస్ట్రేషన్ ప్రకారం ఉద్యోగులను కొనసాగిస్తే వాళ్ళకి జీతాలు ఎక్కువ ఇవ్వాలి.., బోనస్ లు, అదనపు సౌకర్యాలు ఇవ్వాలి. టార్చెర్ పెట్టడం కుదరదు. హక్కులు కాలరాయడం అసలు వీలుపడదు. అందుకే కరోనా అంటూ, లే ఆఫ్ అనీ కొందరిని తీసేయ్యగా.. ఉన్నవారిని వేరే కంపెనీలోకి బదలాయించే ఆలోచనలో ఉన్నారు. ఓ కొత్త కంపెనీని సృష్టించి.., దాని ద్వారా ఈనాడుకి యాడ్స్ వస్తుంటాయి అనే పేరు చెప్పుకుంటూ.., ఈనాడుకి దానికి సంబంధం లేదు అని చెప్పుకునే అతి తెలివి అది. తద్వారా ఉద్యోగులకు సంబంధించిన చాలా సదుపాయాలను తొక్కి పడేయొచ్చు.
* ఈనాడులో ఉంటే వేతనాలు ఎక్కువ ఇవ్వాలి. చట్టం మేరకు నడుచుకోవాలి. అందుకే ఈనాడులో పని చేసే రిపోర్టర్ల కోసం 2015లో ఈనాడు డిజిటల్ అనే సంస్థని స్థాపించి.., నాటి నుండి చీకటి లావాదేవీలు, శ్రమ దోపిడీ నడిపిస్తున్నారు. సేమ్ యాడ్స్ కోసం కూడా ఇప్పుడు మరో శ్రమ దోపిడీ కంపెనీ రాబోతుందన్నమాట..!