రష్మిక మందన్న తనను పెళ్లి చేసుకోవాలనే వాళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కన్నడ సినిమాల నుండి వచ్చిన రష్మిక ఆనతి కాలంలోనే టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగులో రష్మిక నటించిన మొదటి సినిమా ఛలో. అది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అంతే అక్కడి నుండి రష్మిక వెనుతిరిగి చూసింది లేదు. వరస అవకాశాలు ఆమెను చుట్టుముట్టాయి.
ఛలో తర్వాత వెంటనే వచ్చిన గీత గోవిందం అంతకు మించి హిట్. బ్లాక్ బస్టర్ సక్సెస్. దాంతో ఆమె గ్రాఫ్ మరింతగా పెరిగిపోయింది. అయితే గీత గోవిందం తర్వాత చేసిన దేవదాస్, డియర్ కామ్రేడ్ సినిమాలు నిరాశపరిచినా కానీ ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించే అవకాశాన్ని అందుకుంది. మహేష్ – రష్మిక కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇక ఆ తర్వాత నితిన్ తో భీష్మ చేస్తే అది కూడా సూపర్ హిట్టే. ప్రస్తుతం స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన సినిమాలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంది. సుకుమార్ దర్శకత్వంలో రష్మిక ఒక పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపించనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో మంగళూరులో తన ఇంట్లోనే గడిపింది. కుటుంబంతో సమయాన్ని గడపడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెబుతోంది రష్మిక. అయితే ఈమె టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వకముందే ఆమె తన తొలి సినిమా హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్ధం చేసుకుని తర్వాత దాన్ని క్యాన్సిల్ చేసుకున్న విషయం తెల్సిందే.
ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉంటోన్న విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అలాగే ఈ మధ్య రష్మికకు పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నలు ఎక్కువవుతున్నాయట. దీనికి మంచి సొల్యూషన్ చెప్పింది రష్మిక. తనను ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో తన టీమ్ ద్వారా తనను కలవొచ్చని కూర్చొని మాట్లాడుకుందాం, నచ్చితే తాను పెళ్ళికి సిద్ధం అని కన్ఫర్మ్ చేసేసింది.