కర్నూలు పట్టణం జనసంద్రమైంది. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిర్వహించిన రాయలసీమ గర్జన సభకు పెద్ద ఎత్తున మేధావులు, విద్యావేత్తలు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్ధులు, మహిళలు, వైసీపీ నేతలు హజరైయ్యారు. మంత్రులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు వికేంద్రీకరణకు మద్దతుగా ప్రసంగాలు చేశారు. రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ నినాదాలు చేసి నాారాసుర భూతం పేరుతో దిష్టిబొమ్మను దగ్దం చేశారు. ఒక్క రాజధాని వద్దు మూడు రాజధానులే ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. సభావేదిక ఏర్పాటు చేసిన ఎస్టీబీసీ మైదానం మొత్తం జనాలతో నిండిపోయింది.
రాయలసీమ గర్జన సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపిలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ విధానమని మరో సారి స్పష్టం చేశారు. కర్నూలులో న్యాయరాజధాని ఏర్పుటు చేసే విషయంలో ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని చెప్పారు. మూడు రాజధానుల వల్ల భవిష్యత్తులో మరో సారి ప్రత్యేక రాష్ట్ర నినాదం రాదని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేందేలా చూడటం ఈ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. అమరావతి, విశాఖపట్నంలోనూ వికేంద్రీకరణ సభలను పెడతామని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడుతూ వికేంద్రీకరణతోనే అబివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. అందుకే తాము రాయలసీమ గర్జనకు మద్దతు ప్రకటించామని తెలిపారు. చంద్రబాబు అన్నింటినీ ఒకే చోట పెట్టి ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అనుకుంటున్నారనీ, దానిని అందరూ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమలను కూడా అబివృద్ధి చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని చంద్రబాబు మరచిపోయారని, తన వర్గం, తన బినామీలు బాగుపడేందుకే ఏకైక రాజధాని అని చంద్రబాబు అంటున్నారని విమర్శించారు. చంద్రబాబు నిర్ణయాన్ని అందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదనీ, మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని డిప్యూటి సీఎం అంజాద్ బాషా విమర్శించారు. న్యాయరాజధాని కోసం ఎంతకైనా పోరాడుతామని ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అన్నారు. రాజధాని అడిగే హక్కు రాయలసీమకే ఉంది బైెరెడ్డి సిద్దార్ధ రెడ్డి అన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులదే త్యాగమంటున్నారని, శ్రీశైలం ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతులది త్యాగం కాదా అని ప్రశ్నించారు. ఈ సభలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు, మేధావులు ప్రసంగించారు.