డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ నియోజకవర్గ వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రెండు నెలల క్రితమే రాజేశ్వరరావు పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యుఎస్ రాష్ట్ర సలహదారు పదవికి రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం. రిజర్వ్ డ్ నియోజకవర్గమైన రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి రాపాక వరప్రసాద్ జనసేన అభ్యర్ధిగా అయిదువేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి బొంతు రాజేశ్వరరావుపై గెలిచారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పాలవ్వగా, రాజోలులో మాత్రం రాపాక వరప్రసాద్ గెలుపొందారు.
అయితే ఈ గెలుపు తన వ్యక్తిగత చరిష్మాతో దక్కిందన్న భావనతో ఉన్న రాపాక గెలిచిన కొద్ది రోజుల్లోనే వైసీపీకి దగ్గర అయ్యారు. వైసీపీ ఇన్ చార్జిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి రాపాక వరప్రసాద్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అయిదువేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో తొలి సారి ఎమ్మెల్యే అయ్యారు. ఆనాడు జరిగిన త్రిముఖ పోటీలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధిపై రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన రాపాక నాల్గవ స్థానంలో నిలిచారు. నోటా కంటే తక్కువగా కేవలం 318 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో జనసేన క్యాడర్ బలంగా ఉండటంతో రాపాక ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రాపాక వైసీపీ దగ్గర కావడం, రాబోయే ఎన్నికల్లో తానే అభ్యర్ధిగా సంకేతాలు ఇవ్వడంతో రెండు సార్ల వైసీపీ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన నియోజకవర్గ పార్టీ నేత బొంతు రాజేశ్వరరావు కొంత కాలంగా సైలెంట్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహనరెడ్డి ఆయనకు పీఆర్, ఆర్ డబ్ల్యుఎస్ రాష్ట్ర సలహాదారుగా నియమించగా, ఆయన రెండు నెలల క్రితం ఆ పదవికి రాజీనామా చేశారు. రెండు సార్లు పోటీ చేసిన తనను కనీసం ఇన్ చార్జిగా కూడా కొనసాగించకుండా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పటి నుండి వైసీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హజరు కావడం లేదు.ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో రాజేశ్వరరావు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలో ఆయన జనసేన పార్టీ లో చేరడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ నెల 15న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకునే చాన్స్ ఉందని అంటున్నారు. ఆదివారం జరిగిన పవన్ కళ్యాణ్ తో జరిగిన భేటీలో పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం.
నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్