న్యూఢిల్లీ : మీరు బ్యాంకుల నుండి రుణం తీసుకున్నారా? అయితే మీరు ఊరట చెందే శుభ వార్త అందించింది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI). ఆర్బీఐ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రుణ మారటోరియం అవకాశాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. దీంతో టర్మ్ లోన్ తీసుకున్న వారు మరో మూడు నెలలు నెలలు ఈఎంఐ (నెల వారి కిస్తీ) చెల్లించాల్సిన అవసరం లేదు. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంతకు ముందే మూడు నెలల (మార్చి నుండి మే వరకు) మారటోరియం ప్రకటించిన విషయం విదితమే. తాజాగా నిర్ణయించిన మారటోరియం వెసులుబాటుతో మరో మూడు నెలలు అంటే ఆగస్టు వరకు నెల వారి కిస్తీలు (EMI) చెల్లించాల్సిన అవసరం లేదు.
కొవిడ్-19 వైరస్ విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆర్థిక వ్యవస్థకు చాలా తీవ్రమైన సవాళ్లు ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకునే అవకాశం ఉందన్నారు.టర్మ్ లోన్ లపై మారటోరియం మరో మూడు నెలలు పొడిగింపు ఇస్తున్నట్లు చెప్పారు. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు టర్మ్ లోన్లపై మారటోరియం పొడిగిస్తున్నట్లు ఆయన వివరించారు.
కరోనా వ్యాప్తి కట్టడి ఆధారంగానే ఆర్థిక కార్యకలాపాల భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పిన ఆయన ఈ పరిస్థితులు వ్యవసాయ రంగానికి మాత్రం మరింత ప్రోత్సాహకంగా ఉన్నాయని చెప్పారు. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోందని శక్తికాంత దాస్ తెలిపారు.
డాలర్తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గిందన్నారు. భారత విదేశీ మారక నిల్వలు 487 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గిందని వివరించారు. మార్చి, ఏప్రిల్లో సిమెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడిందని అన్నారు.
తక్కువ ధరలో రుణాలు, వడ్డీ రేట్లు తగ్గాయని, దీంతో సామాన్యుడికి లాభం చేకూరుతుందని వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో ఇది పెట్టుబడులపై తీవ్ర పరిణామం చూపిస్తోందని తెలిపారు. ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా కట్టడి చేస్తామని ఆయన చెప్పారు. 13 నుంచి 32 శాతం మేర ప్రపంచ వాణిజ్యం తగ్గిందని తెలిపారు. కూరగాయలు, నూనె గింజల ధరలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
రెపో రేటును 4.40 నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రివర్స్ రెపో రేటు 3.2 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో మరిన్ని నిధులు అందుబాటులో ఉంచేందుకే రెపోరేటు తగ్గించామని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం అంచనా వేయడం క్లిష్టంగా మారిందన్నారు. సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం లాక్డౌన్ నిబంధనల అమలుపై, కరోనా అనంతర పరిస్థితుల డిమాండ్లపై ఆధారపడి ఉండొచ్చని శక్తికాంత దాస్ అభిప్రాయపడ్డారు.