గడిచిన రెండేళ్లుగా ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డిజిటల్ సేవల్లో పదే పదే అంతరాయాలు కలుగుతుండటంపై రిజర్వ్ బ్యాంక్ తీవ్రంగా స్పందించింది. డిజిటల్ 2.0కు సంబంధించిన అన్ని కార్యకలాపాలను బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే కొత్త క్రెడిట్ కార్డ్ కస్టమర్లను పొందటం కూడా తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ సూచించింది‘ అని స్టాక్ ఎక్సే్చంజీలకు బ్యాంక్ తెలియజేసింది. గత రెండేళ్ల నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వీసులకు అప్పుడప్పుడు అంతరాయం కలుగుతూనే వస్తోంది. తాజాగా నవంబర్ 21న బ్యాంక్ ప్రధాన డేటా సెంటర్లో పవర్ ఫెయిల్యూర్ కారణంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సర్వీసులను అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఆర్బీఐ ఇప్పుడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్కు ఆదేశాలు జారీ చేసింది. మొదట డిజిటల్ 2.0 ద్వారా ప్రారంభించాలనుకుంటున్న అన్ని డిజిటల్ బిజినెస్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆర్బీఐ కోరింది.
వివరాల్లోకి వెళ్తే హెచ్డీఎఫ్సీ బ్యాంకు కస్టమర్లకు పలుమార్లు డిజిటల్ సేవల్లో అంతరాయం కలిగిన సంగతి తెలిసిందే. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్, ఇతర లావాదేవీల్లో అంతరాయం కలుగుతోంది. పేమెంట్స్లో సమస్యలు వచ్చాయని కస్టమర్లు నవంబర్ 21న కంప్లైంట్ చేశారు. ఈ సమస్య 12 గంటలపాటు ఉంది. నవంబర్ 22 ఉదయం వరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు.తమ ప్రాథమిక డేటా సెంటర్లో విద్యుత్ సరఫరాలో అంతరాయాలే ఇందుకు కారణమంటూ సంస్థ వివరణ ఇచ్చినప్పటికీ.. బ్యాంక్పై కస్టమర్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. 2019 డిసెంబర్ 3న కూడా ఇలాంటి సమస్యే వచ్చింది. కస్టమర్లు లోన్ ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించలేకపోయారు. అప్పుడు సాంకేతిక సమస్య తలెత్తిందని బ్యాంకు వెల్లడించింది. కొన్నాళ్లుగా బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆన్లైన్ మాధ్యమం వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో పాటు ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ సహా పలు బ్యాంకులు ఇలాంటి సాంకేతిక సమస్యలే ఎదుర్కొంటున్నాయి. దీనితో ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ బోర్డు తప్పులు ఎక్కడ జరిగాయో చూసుకొన్ని మళ్లీ అవి తలెత్తకుండా చూసుకోవాలని ఆర్బీఐ సూచించింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్బీఐ సంతృప్తి చెందితేనే ఈ ఆదేశాలను ఉపసంహరణ ఉంటుందని తెలిపింది. అయితే ఐటీ వ్యవస్థల్ని బలోపేతం చేసేందుకు కావాల్సిన చర్యల్ని తీసుకుంటున్నట్టు స్టాక్ ఎక్స్ఛేంజ్లకు ఫైలింగ్లో వివరించింది హెచ్డీఎఫ్సీ బ్యాంకు. అయితే ప్రస్తుతం క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని ఉఫయోగిస్తున్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండదని, ఆర్బీఐ సూచనలు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేయదని హెచ్డీఎఫ్సీ బ్యాంకు చెబుతోంది. కస్టమర్లకు ఎలాంటి సమస్యలు లేకుండా డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని అందించేందుకు ప్రయత్నిస్తున్నామని హెచ్డీఎఫ్సీ బ్యాంకు తెలిపింది. కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు బ్యాంక్ కొత్త సీఈవో శశిధర్ జగదీశన్ పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్ను మెరుగుపర్చుకునేందుకు బయట నిపుణుల సహా యం కూడా తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో వివరించారు.