ప్రస్తుతం భారతీయ మార్కెట్ లో కొత్త కరెన్సీ నోట్లు కుప్పలుతెప్పలుగా చలామణి అవుతున్నాయి. పది రూపాయల నుంచి 2000 రూపాయల నోటు వరకు అన్ని కొత్త నోట్లు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో పాత నోట్ల విషయంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వంద రూపాయలు, పది రూపాయల అదేవిధంగా ఐదు రూపాయలు చలామణిలో ఉన్న పాత నోట్లను.. మార్చి లేదా ఏప్రిల్ మాసంలో ఉపసంహరించుకోవడానికి రిజర్వ్ బ్యాంకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
ఈ విషయాన్ని స్వయంగా ఆర్.బి.ఐ జనరల్ మేనేజర్ బీ మహేష్ ఇటీవల తెలిపారు. కర్ణాటక అదేవిధంగా దక్షిణ కన్నడ జిల్లాలో జిల్లా స్థాయి సెక్యూరిటీ కమిటీ (DLSC), జిల్లాస్థాయి కరెన్సీ మేనేజ్మెంట్ కమిటీ (DLMC) సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. చలామణిలో ఉన్న పాత సీరిస్ నోట్లు వచ్చే మార్చి నాటికి చలామణిలో లేకుండా చేయాలనే లక్ష్యంతో ఆర్బీఐ ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా గత ఆరు సంవత్సరాల నుండి.. ఈ నోట్లకు సంబంధించి ప్రింటింగ్ కూడా ఆర్బీఐ ఆపేసినట్లు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ విషయంలో ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎటువంటి ఇబ్బందులు ఉండవని పాత నోట్లు అంతా ప్రస్తుతం బయటికి చెల్లుబాటు అవుతాయి అని చెప్పుకొచ్చారు.