రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు గత 12 ఏళ్లుగా టైటిల్ కోసం వీరి వేట కొనసాగుతూనే ఉంది. గత మూడు సీజన్లు అయితే బెంగళూరు తమ ఆటతీరుతో తీవ్రంగా నిరాశపరిచింది. గత ఐపీఎల్ లో మొదటి 6 మ్యాచ్ లు ఓడిపోయి చివరికి ఆఖరి స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే వీటికి భిన్నంగా ఈసారి మొదటి మ్యాచ్ లో బెంగళూరు టీమ్ హైదరాబాద్ ను 10 పరుగుల తేడాతో మట్టికరిపించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇక ఆర్సీబీ రెండో మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7:30 నిమిషాలకు జరగనుంది. కింగ్స్ XI పంజాబ్ తో తలపడనుంది. పంజాబ్ కథ కూడా భిన్నంగా ఏం లేదు. ఏళ్ళు గడుస్తున్నా, కెప్టెన్సీ మారుతున్నా, టీమ్స్ చేంజ్ అవుతున్నా పంజాబ్ తలరాత మారట్లేదు. ఈ సీజన్ మొదటి మ్యాచ్ లో కూడా వీళ్లకు దురదృష్టం వెంటాడింది. చేతిలో ఉన్న మ్యాచ్ ను చేజేతులా టై చేసుకుని, సూపర్ ఓవర్ లో దారుణంగా ఓటమి పాలయ్యారు. మూడు బంతుల్లో ఒక్క రన్ కొట్టలేక చతికిల పడ్డారు. అయితే తమ రెండో మ్యాచ్ లో అయినా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నారు రాహుల్ అండ్ టీమ్. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. కెఎల్ రాహుల్ ఫామ్ అందుకుంటే ఇక ప్రత్యర్థులకు తిప్పలే. మొదటి మ్యాచ్ లో రెండు డకౌట్ లు అయిన నికోలస్ పూరన్ స్థానంలో క్రిస్ గేల్ జట్టులోకి వచ్చే అవకాశముంది. ఇక భారీగా పరుగులు సమర్పించుకున్న జోర్డాన్ స్థానంలో ముజీబ్ రహ్మాన్ ఆడే అవకాశాలు ఉన్నాయి.
రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు విషయానికొస్తే మొదటి మ్యాచ్ లో అన్నీ సెట్ అయినట్లే కనిపించాయి. బ్యాటింగ్ విషయంలో పెద్ద ఆందోళనలు లేవు. దేవదత్ కుదురుకుంటున్నాడు. ఆరోన్ ఫించ్ పర్లేదనిపించాడు. ఆ తర్వాత కోహ్లీ, డివిలియర్స్ ఉండనే ఉన్నారు. బెంగళూరు చింత అంతా బౌలింగ్ గురించే. ఉమేష్ యాదవ్, డేల్ స్టెయిన్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. పేస్ దళంలో జాగ్రత్త పడితే పంజాబ్ మీద బెంగళూరుదే పైచేయి అయ్యే అవకాశముంది.