హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత సింగరేణిలో పునరాగమనం చేస్తున్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్రం మొగ్గు చూపుతున్నది. ఈ నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా కార్మికులతో కలసి పోరాటానికి సిద్ధం అవుతున్నారు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.
దాదాపు 50 బొగ్గు గనుల ప్రైవేటీకరణకు కేంద్రం సన్నద్ధం అవుతుందన్న వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు సింగరేణి వ్యాప్తంగా ఆందోళనకు పిలుపు ఇచ్చారు. ఈ ఉద్యమంలో కవిత పాల్గొననున్నారు. వచ్చే నెల రెండవ తేదీన టీ ఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ సమ్మె కు పిలుపును ఇచ్చింది. ఈ నేపథ్యంలో సంఘం బలోపేతంపై కవిత దృష్టి పెట్టారు.
ఇప్పటికే సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికలు జరగాల్సి ఉండగా కొంత కాలంగా వాయిదా పడుతూ వచ్చాయి. గతంలో టీబీజీకేఎస్ కు కవిత గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే కొన్నాళ్ళ క్రితం ఈ పదవికి కవిత, టీఆర్ఎస్ అనుబంధ ఆర్టీసీ కార్మిక సంఘం గౌరవాధ్యక్ష పదవికి హరీష్ రావులు రాజీనామా చేశారు. టీఆర్ఎస్ లో కీలక నేతలైన వీరు కీలకమైన కార్మిక సంఘాల పదవుల నుండి తప్పుకోవడం నాడు తీవ్ర చర్చనీయాంశమైంది.
అయితే ఇప్పుడు సింగరేణిలో కార్మిక సంఘాల ఎన్నికల ముందు పార్టీ అనుబంధ కార్మిక సంఘం బలోపేతంపై కల్వకుంట్ల కవిత దృష్టి పెట్టారు. గతంలో కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా భాద్యతలు నిర్వహించిన అనుభవం, పరిచయాల కారణంగా కవిత సమర్ధవంతంగా పనిచేస్తుందని భావించి పార్టీ పంపుతున్నట్లు తెలుస్తోంది.
బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ఈ ఉద్యమంలో ఆమె ప్రధాన భూమిక పోషించాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో భాగంగా జాతీయ కార్మిక సంఘాలు రెండు మూడు రోజుల సమ్మెకు కార్యాచరణ రూపొందించాయి.
కాగా గత సార్వత్రిక ఎన్నికల్లో కవిత పరాజయం పాలైన విషయం తెలిసిందే.