కరోనా… మూడు నెలల కిందట ఈ పేరంటే మనకు అతిధి… రెండు నెలల కిందట మనకు భయం… నెల రోజుల కిందట అప్రమత్తం… ప్రస్తుతం ఆందోళనకరం… వచ్చే నెల నాటికి సహజీవనంగా మారినా ఆశ్చర్యం అవసరం లేదు. దేశంలో కరోనా విపరీతంగా పెరుగుతుంది. దేశ వ్యాప్తంగా రోజుకి సగటున 12000 కేసులు…, ఏపీలో రోజుకి సగటున 350 కేసులు నమోదవుతున్నాయి. గడిచిన నెల రోజుల నుండి పెరుగుదల విపరీతంగా ఉంది. ఇంతలా కరోనా వ్యాప్తికి కారణం ఏంటి…? ప్రభుత్వాల విఫలమా..? ప్రజలు విచ్చలవిడిగా తిరిగేయడమా..? నిర్లక్ష్యమా…? కారణం ఏంటి…??
లాక్ డౌన్ ఉన్నప్పుడు ఇలా…!
లాక్ డౌన్ ఉన్నప్పుడు దేశంలో రోజుకి సగటున 3 వేల కేసులు నమోదయ్యేవి. లాక్ డౌన్ మొదటి దశలో రోజుకి 1200 సగటు, లాక్ డౌన్ రెండో దశలో రోజుకి 2000 సగటు.., లాక్ డౌన్ మూడో దశలో 3500 సగటు.., లాక్ డౌన్ నాలుగో దశలో 6000 సగటు ఉండేది. మొత్తానికి లాక్ డౌన్ అమలైనప్పుడు దేశ వ్యాప్తంగా అంటే మార్చి 22 నుండి మే 15 వరకు 85 వేల కేసులు నమోదయ్యాయి. ఇది పెద్దగా భయపెట్టలేదు. అదుపులోనే ఉంది అనుకున్నారు. కరోనాని జయించేశామని సంబరపడ్డారు. మోడీ ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారంటూ బిజెపి నేతలు భజనలు మొదలు పెట్టారు. పనిలో పనిగా ఆకలి చావులు పెరగడం, ఆర్ధికంగా దేశం దెబ్బ తినడం, వ్యాపారాలు ఆగిపోవడం, పేద బతుకులకు ఉపాధి లేకపోవడంతో లాక్ డౌన్ ఎత్తివేయాలని నిర్ణయించారు. దేశంలో ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా లాక్ డౌన్ ని నెమ్మదిగా ఎత్తివేశారు. లాక్ డౌన్ కొనసాగిస్తే దేశం ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారుతోంది. అప్పటికే జీడీపిలో 7 శాతం కోల్పోయాం అంటూ ఆర్ధిక నిపుణులు చెప్పుకొచ్చారు…, ఇది ఆగాలంటే లాక్ డౌన్ ఎత్తివేయక తప్పలేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం కరోనా ఉన్న ఒక వ్యక్తి లాక్ డౌన్ ఉన్న ప్రాంతంలో ఉంటె కేవలం ఇద్దరికీ మాత్రమే అంటించగలరు. కానీ లాక్ డౌన్ లేకపోతే ఒకరి ద్వారా 406 మందికి సోకుతుంది. ఈ లెక్క ఇప్పుడు దేశాన కలవరపెడుతుంది.
లాక్ డౌన్ తీసేసిన తర్వాత…!
ఆర్ధికంగా పుంజుకోవాలంటే లాక్ డౌన్ ఎత్తివేయాలి. ఉపాధి చూపాలి, దుకాణాలు తెరవాలి, కొనుగోళ్లు పుంజుకోవాలి… తద్వారా దేశాన ఆర్ధికంగా కొంత ఊరట కావాలి. అందుకే కరోనా పూర్తిగా అదుపులోకి రాకమునుపే లాక్ డౌన్ ఎత్తివేశారు. ఆ తర్వాత నుండి దేశంలో పెరుగుదల ఎక్కువగా ఉంది. మే 16 నుండి దేశంలో రోజుకి 9 నుండి పది వేల కేసులు నమోదవ్వగా.., ప్రస్తుతం దేశంలో రోజుకి సగటున 12 , 13 వేల కేసులు వస్తున్నాయి. ప్రస్తుతం నాలుగు లక్షలకు చేరువయ్యామ్.., ప్రపంచంలో కరోనా కేసుల్లో నాలుగో స్థానంలో ఉన్నాం. గడిచిన నెల రోజుల్లోనే దాదాపు మూడు లక్షల కేసులు నమోదయ్యాయి. దీనికి కారణాలు పరిశీలిస్తే…!
* లాక్ డౌన్ ఎత్తివేయడం. కరోనా పరీక్షలు పూర్తిస్థాయిలో జరగకముందే, కరోనా ఇంకా అదుపులోకి రాకముందే లాక్ డౌన్ ఎత్తివేయడం వలన రాకపోకలు బాగా పెరిగాయి. జన సంచారం, రాకపోకలు, వ్యాపారాలు, మార్కెట్లు తెరుచుకోవడంతో జనాల మధ్య కలయిక పెరిగింది. ఇదీ ఒక కారణం.
* దేశంలో పల్లెల్లో నివాసాలు ఎక్కువ. దాదాపు 70 శాతం జనం పల్లెల్లోనే ఉంటారు. అందుకే మొదటి నుండి మన దేశంలో పల్లెల్లో కరోనా రాకుంటే కొంత అదుపులో ఉంటుందని భావించారు. కానీ గత నెల రోజులుగా నమోదవుతున్న కేసుల్లో సగం పల్లెల నుండి ఉంటున్నాయి..
* పల్లెల్లో జన జీవనం స్వేచ్ఛగా ఉంటుంది. నివాసాలు దగ్గరగా ఉంటాయి. మనుషుల మధ్య కలయికలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఒకరికి వచ్చినా… మిగిలిన వారికి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అదే జరుగుతుంది.
* దేశంలో కీలకమైన మార్కెట్లు, రద్దీ ఎక్కువగా ఉండే కోయంబేడు వంటి మార్కెట్లు తెరుచుకోవడంతో అక్కడ మూల కేంద్రాలుగా మారాయి. బస్సులు, ట్రైన్లు ద్వారానూ కొంత వ్యాప్తి ఉంది.
* కరోనా పరీక్షలు కూడా ప్రస్తుతం ఎక్కువగానే జరుగుతున్నాయి. కానీ కావాల్సిన సంఖ్యలో మాత్రం జరగడం లేదు. ప్రతి పది లక్షల జనాభాకు కనీసం 50 వేల మందికి పరీక్షలు జరగాల్సి ఉండగా.., ప్రస్తుతం 4 వేల మందికి మంత్రమే జరుగుతున్నాయి.