వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఏమిటో గానీ వైపాకాకు ఆ విషయంలో తలబొప్పి కడుతోంది. ఇప్పటికే రఘురామకృష్ణరాజు తన సొంత పార్టీకే వెనుక ఉండి గోతులు తవ్వుతున్నారని చెప్పి ఆయనపై ఎంపీ విజయసాయిరెడ్డి బృందం లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. దీంతో రేపో, మాపో రఘురామకృష్ణరాజుపై స్పీకర్ చర్యలు తీసుకుంటారనే ధీమాతో విజయసాయి రెడ్డి బృందం ఉత్సాహంగా ఉంది. కానీ మరోవైపు.. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి ? అని ప్రశ్నిస్తే.. అందుకు విజయసాయి రెడ్డి.. ఆ విషయం టీడీపీనే అడగాలని మాట దాటవేస్తున్నారు. మీరు.. మీ పార్టీ ఎంపీ మీకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి ఆయనపై అనర్హత వేటు వేయాలని కోరారు. అదే ఇతర పార్టీల నేతల్ని మీ పార్టీలోకి తీసుకుంటే మాత్రం మీరు ఎందుకు నోరు మెదపడం లేదు.. అని వైసీపీ నేతలను అడిగితే వారు సమాధానం చెప్పలేక చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
అయితే టీడీపీ నుంచి ముగ్గురు, జనసేన ఒక ఎమ్మెల్యే.. నిజానికి వైకాపాతో ఎప్పటి నుంచో తెర వెనుక మంతనాలు జరుపుతూ టచ్లోనే ఉంటున్నారు. ఇక వారితో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్తే ఎలాగూ అధికార పార్టీ కనుక వారిని గెలిపించుకోవడం కూడా వైకాపాకు పెద్ద కష్టం కాదు. కానీ.. మరోవైపు అధికార వైసీపీ ఆ రిస్క్ ఎందుకు తీసుకోవడం అని భావిస్తున్నట్లు తెలిసింది. అయినప్పటికీ వైసీపీ.. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయించి, ఉప ఎన్నికలకు వెళ్లి గెలవాలని చూస్తోంది. అందువల్లే వైకాపాకు ప్రతిపక్షాలు పదునైన ప్రశ్నలను బాణాల రూపంలో సంధిస్తున్నాయి. ఇక మరోవైపు.. టీడీపీ నుంచి రావాలనుకుంటున్న ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి ఆ విధంగా ముందుకు సాగితే ఎలా ఉంటుంది ? అని కూడా వైసీపీ నేతలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది.
ఇక ఈ విషయాలన్నీ టీడీపీ, జనసేలకు చెందిన ఆయా ఎమ్మెల్యేలకు తెలిసి వారు కొద్దిగా ఆందోళన చెందుతున్నారట. పార్టీలను వీడితే తమపై అనర్హత వేటు పడకుండా చూస్తాం.. అన్న హామీని ముందుగా ఇస్తేనే.. వారు వైసీపీలో చేరుతామని అంటున్నారట. ఇప్పుడిలా మాట మారిస్తే తమ రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందని టీడీపీ, జనసేన నేతలు అంటున్నారట. ఇవే విషయాలను వారు వైసీపీ నేతల వద్ద ప్రముఖంగా చర్చకు తెస్తున్నట్లు తెలిసింది. అయితే రఘురామకృష్ణం రాజు మాటల నుంచి తప్పించుకోవడానికి.. విపక్షాలకు బదులు ఇవ్వడానికి.. తాము ఓ గేమ్ ప్లాన్ను అనుసరిస్తున్నామని.. అదంతా అందులో భాగమనేని.. అంతే తప్ప.. అనర్హత లేదు, ఏమీ లేదు.. ఆయా నేతలకు వైసీపీలోనూ ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావు.. అని వైసీపీ నుంచి నేతలు లీకులు ఇస్తున్నట్లు తెలిసింది.