RRR Arrest: పోకిరీ సినిమాలో ప్రకాష్ రాజ్ – షాయాజీ షిండేల జైలు సీన్ గుర్తుండే ఉంటుంది.. అనేక నేరాలు చేసి ఎక్కడెక్కడో తిరిగే ప్రకాష్ రాజ్ ని వలవేసి పట్టుకుని.. జైల్లో పెట్టాక పోలీసులు ఏమీ చేయరు కానీ.., రాత్రంతా నిద్ర లేకుండా చేస్తారు. ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణంరాజు ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ అంత నేరాలు/ ఘోరాలు చేయకపోయినప్పటికీ… ఏపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ నీ, అధికార పార్టీని విసిగించారు. తన వ్యాఖ్యలతో ముప్పుతిప్పలు పెడుతున్నారు.
అందుకే ఎట్టకేలకు అతన్ని వలవేసి పట్టుకున్న ఏపీ సీఐడీ కూడా రాత్రంతా నిద్ర లేకుండానే అతన్ని విసిగించినట్టు సమాచారం..! ఎక్కువ సేపు వేచి చూసేలా చేయడం.. నిద్ర లేకుండా విసిగించడం.., వేళ కానీ వేళల్లో విచారణకు పిలవడం పోలీసు విచారణలో ఓ స్పెషల్ ట్రీట్మెంట్..!ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే …నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. ఎఫ్ఐఆర్ లో రఘురామను ఏ1గా పేర్కొన్న పోలీసులు, ఏ-2 ఏ-3గా రెండు చానల్స్ ను చేర్చారు. శుక్రవారం రాత్రంతా గుంటూరు సీఐడీ ఆఫీసులోనే రఘురామను అధికారులు ఉంచారు. అర్థరాత్రి వరకు ఆయనను విచారించారు. సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ స్వయంగా గుంటూరు ఆఫీసుకి వెళ్లారు.
RRR Arrest: ఇవీ సీఐడీ ప్రశ్నలు!
అధికార పార్టీ ఎంపీగా ఉంటూ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని అధికారులు ప్రశ్నించారు. ప్రభుత్వంపై కుట్రపూరితంగా వ్యవహరించమని, మీ వెనుకుండి నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు. కాగా, సీఐడీ అధికారుల తీరుపై రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తనను కావాలనే కేసులో ఇరికించిందని, తాను చేసిన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హై సెక్యూరిటీ వింగ్ లో ఉన్న తనను అక్రమంగా అరెస్ట్ చేసినట్లు రఘురామ వాదిస్తున్నారు.
అంతకుముందు ఏం జరిగిందంటే?
ఏపీ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరించారనే అభియోగాలతో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు శుక్రవారం ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు గుంటూరు తీసుకెళ్లారు. రాత్రి నుంచి ఆయన సీఐడీ కార్యాలయంలోనే ఉన్నారు. అర్ధరాత్రి వరకు అదనపు డీజీ సునీల్కుమార్ నేతృత్వంలో ఎంపీని విచారించారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యల సమాచారం, సాంకేతిక సహకారం ఎవరిస్తున్నారని ప్రశ్నలు వేశారు. ఈ విషయాల్లో ఎవరు సహకరిస్తున్నారని అడిగారు.సీఐడీ కార్యాలయంలోనే ఎంపీకి శనివారం ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించారు. జీజీహెచ్ వైద్య బృందంతో పరీక్షలు చేయించారు. ఎంపీకి అవసరమైన మందులు, అల్పాహారాన్ని ఆయన వ్యక్తిగత సిబ్బంది సీఐడీ కార్యాలయంలో అందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వాటిని ఎంపీకి అందజేశారు.అయితే రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ ని శనివారం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ వ్యవహారం ఇక ఏ మలుపు తిరుగుతుందో చూడాలి!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?