అమరావతి, జనవరి 6: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అరుదైన రికార్డు సాధనకు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు స్పిల్ ఛానల్లో గిన్నిస్ రికార్డు స్థాయిలో కాంక్రీట్ వేసేందుకు ఆదివారం ఉదయం పనులు ప్రారంభమైయ్యాయి. సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకూ ఈ పనులు కొనసాగనున్నాయి. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో దీన్ని నమోదు చేసేందుకు గిన్నిస్ బుక్ ప్రతినిధి విశ్వనాథ్ ఆదివారం అక్కడకు చేరుకున్నారు. ఇప్పటి వరకూ ఉన్న దుబాయికి చెందిన గిన్నిస్ రికార్డును అధిగమించేందుకు పోలవరం ప్రాజెక్టు పనులలో 24గంటల్లో 30వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసేందుకు ఏర్పాటు చేసినట్లు నవయుగ కన్స్ట్రక్షన్స్ ఎండీ బి. శ్రీధర్ తెలిపారు. 24మంది గిన్నిస్ బుక్ ప్రతినిధులు ఈ పనులను పరిశీలిస్తున్నారు.
2017 మే నెలలో దుబాయిలో ఒక టవర్ నిర్మాణానికి 36గంటల్లో 21.580 ఘనపు మీటర్ల కాంక్రీట్ వేసి రికార్డు సృష్టించారని, ఆ రికార్డు అధిగమించేందుకు 24గంటల్లోనే 30వేల ఘ.మీ కాంక్రీట్ వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు పనుల్లో భాగంగా మూడు నెలల క్రితం 24గంటల వ్యవధిలో 11.158 ఘ.మీ కాంక్రీట్ వేశారు. మళ్లీ గత నెలలో 11.289 ఘ.మీ కాంక్రీట్ పనులు చేసి రికార్డును అధిగమించారు. నేడు ఏకంగా 30వేల ఘ.మీ కాంక్రీట్ వేసేందుకు కాంట్రాక్ట్ సంస్థ నవయుగ ఆధ్వర్యంలో అధికారులు సర్వం సిద్ధం చేయగా ప్రతి 15 నిమిషాలకు ఒక సారి గణాంకాలను గిన్నిస్ బుక్ ప్రతినిధులు నమోదు చేసుకుంటున్నారు. సోమవారం ఉదయం పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించనున్నారు.