ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ అక్టోబర్ 17 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 16న అమెజాన్ ప్రైమ్ మెంబర్లకు ఒక్క రోజు ముందుగానే ఈ సేల్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ సేల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని అమెజాన్ వెల్లడించింది. సేల్ ప్రారంభమైన మొదటి 48 గంటల్లోనే అమెజాన్లోని 1.1 లక్షల మంది విక్రయదారులకు ఆర్డర్లు వచ్చాయని అమెజాన్ తెలియజేసింది. ఇక గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున వినియోగదారులు అనేక ఉత్పత్తులను కొనుగోలు చేశారని కూడా అమెజాన్ తెలిపింది.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో టైర్ 2, 3 పట్టణాలకు చెందిన వారే ఎక్కువగా వస్తువులను కొన్నారని అమెజాన్ తెలిపింది. కొత్తగా 91 శాతం మంది కస్టమర్లు అమెజాన్ లో రిజిస్టర్ చేసుకున్నారని, కొత్తగా 66 శాతం మంది ప్రైమ్ సభ్యత్వం తీసుకున్నారని తెలియజేసింది. అది కూడా చిన్న పట్టణాలు, నగరాలకు చెందిన వారే ఎక్కువగా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారని అమెజాన్ వెల్లడించింది.
గతేడాదితో పోలిస్తే ఈ సారి పండుగ సీజన్లో ఈఎంఐల ద్వారా వస్తువులను కొనేవారి సంఖ్య పెరిగింది. కేవలం అక్టోబర్ 16న నిర్వహించిన అమెజాన్ ప్రైమ్ ఎర్లీ యాక్సెస్ సేల్లోనే రూ.600 కోట్లు విలువ చేసే మొత్తానికి కస్టమర్లు ఈఎంఐలు పొందారని అమెజాన్ తెలిపింది. మొత్తం 24 బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల ద్వారా అమెజాన్ కస్టమర్లకు ఈఎంఐ సదుపాయం కల్పిస్తోంది.
అమెజాన్లో అమ్ముడైన ఏసీలు, ఫ్రిజ్ లు, వన్ప్లస్ ఫోన్లు, ఒప్పో ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకే కస్టమర్లు ఎక్కువగా ఈఎంఐలు పెట్టుకున్నారు. వారు చిన్న పట్టణాలు, నగరాలకు చెందిన వారు కావడం విశేషం. అలాగే వర్క్ ఫ్రం హోం చేస్తున్న వారు స్టడీ టేబుల్స్, చెయిర్స్ ఎక్కువగా కొన్నారు. డిష్ వాషర్లు కూడా ఎక్కువగానే అమ్ముడయ్యాయని అమెజాన్ తెలిపింది.
వన్ప్లస్, శాంసంగ్, యాపిల్, షియోమీలకు చెందిన ఫోన్లను చాలా మంది అమెజాన్ సేల్లో కొంటున్నారు. ముఖ్యంగా ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉన్నందున, ఆ ఫోన్ను చాలా మంది కొన్నారు. ఐఫోన్ 11 రూ.49,999 ప్రారంభ ధరకు ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీని వల్ల గతేడాది పండుగ సీజన్ కన్నా ఈ సారి అమెజాన్లో వినియోగదారులు ఐఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేశారు. అలాగే రెడ్మీ నోట్ సిరీస్, రెడ్మీ 9ఎ, వన్ప్లస్ 8టి, వన్ప్లస్ నార్డ్, శాంసంగ్ ఎం31 ప్రైమ్ ఎడిషన్ ఫోన్లను చాలా మంది కొన్నారని అమెజాన్ తెలిపింది. ఇక సేల్ బుధవారం వరకు కొనసాగనుంది. దీంతో ఈ రెండు రోజుల వ్యవధిలో మరింత భారీ స్థాయిలో అమ్మకాలు జరగవచ్చని అమెజాన్ అంచనా వేస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?