జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వంలో, పార్టీలో కేవలం రెడ్లకు ప్రాధాన్యత లభిస్తోందని ఒక ప్రచారం సాగుతోంది!
పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా ఈ మధ్య ఇదే తరహా ఆరోపణలు చేయడం తెలిసిందే.కానీ వాస్తవానికి ఇందుకు భిన్నమైన పరిస్థితి వైసీపీలో నెలకొని ఉందంటున్నారు.అందరికన్నా ఎక్కువగా రెడ్డి సామాజిక వర్గీయులే వైసిపిలో తమకు తగ్గుతున్న ప్రాధాన్యత పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని వినికిడి! ఏ పదవి వచ్చినా ఈ మధ్య కాలంలో జగన్ బీసీలకు ఇచ్చేస్తున్నారంటూ వారు లోలోపలే రగిలిపోతునారట. నిజానికి జగన్ అధికారంలోకి రావడానికి అనేక కారణాల్లో రెడ్డి సామాజికవర్గం కఠోర శ్రమ కూడా ఒకటని చెప్పక తప్పదు.రెడ్డి సామాజికవర్గం నేతలు ఆర్థికంగా పార్టీ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడ్డారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా వాళ్లే దగ్గరుండి పార్టీని నడిపారు.
ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక తమకు పదవులు వస్తాయని రెడ్డి కులస్తులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తమదే ఆధిపత్యం అని భావించారు. కానీ వైఎస్ జగన్ రూటు మాత్రం వేరేగా ఉంది. అధికారంలోకి వచ్చాక రెడ్డి సామాజికవర్గాన్ని ఆయన పూర్తిగా పక్కన పెట్టేశారు. పూర్తిగా బీసీ మంత్రాన్ని పఠిస్తున్నారు. ఏ పదవి వచ్చినా బీసీ, ఎస్సీ, మైనారిటీలకు కేటాయిస్తున్నారు.జగన్ బీసీ నామజపం చేయడం పార్టీలోని రెడ్డి సామాజికవర్గం నేతలకు నచ్చడం లేదు. కానీ జగన్ మాత్రం పదవులన్నీ బలహీన వర్గాలకే అంటున్నారు.ఇటీవల రెండు రాజ్యసభ సీట్లను బీసీలకు ఇచ్చేశాడు. మూడు ఎమ్మెల్సీ పదవులను బీసీలకే జగన్ కట్టబెట్టాడు!
దీంతో ఇటీవల రెడ్డి సామాజికవర్గంలో దీనిపై చర్చ జరిగిందని చెబుతున్నారు. కొందరు రెడ్డి సామాజికవర్గం నేతలు ఈ విషయాన్ని జగన్ దృష్టిికి కూడా తీసుకెళ్లారు. అయితే తన తీరు ఇంతే అని సున్నితంగా చెప్పినట్లు తెలుస్తోంది. జగన్ లెక్కలు ఈ విషయంలో వేరేగా ఉన్నాయట! కొద్దిగా మనసు కష్ట పెట్టుకున్నా రెడ్డి సామాజిక వర్గం తన నుండి దూరంగా జరగబోదని ఆయన అంచనా. కాని టిడిపిని చావు దెబ్బ కొట్టాలంటే బీసీలను అందలమెక్కి౦చక తప్పదన్నది జగన్ అంచనా! అదే ఎత్తుగడతో జగన్ అడుగులు ముందుకు వేస్తున్నారు! మరి రెడ్లను ఆయన ఎలా దువ్వుతారో కూడా వేచి చూడాలి!