భారత వ్యాపార దిగ్గజం జియో ప్లాట్ ఫామ్స్ తన స్పీడ్ పెంచుతున్నట్టే కనబడుతోంది. ఏకంగా గూగుల్ నే ఆకర్షిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో డిజిటల్, టెలికం విభాగమైన జియో ప్లాట్ఫామ్స్లో 4 బిలియన్ డాలర్లు (30,000 కోట్లు) ఇన్వెస్ట్ చేసే యోచనలో గూగుల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
వచ్చే ఏడేళ్లలో దేశీయంగా 10 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని భావిస్తున్నట్టు ఇప్పటికే గూగుల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. డిజిటల్ టెక్నాలజీస్లో మరింత విస్తరించాలనేదే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చింది. దీనిపై ఆర్ఐఎల్, గూగుల్ ఇప్పటికీ ఏమీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఎన్ఎస్ఈలో 1 శాతం బలహీనపడి రూ.1915 వద్ద ట్రేడ్ వుతోంది. ఇంట్రాడేలో రూ. 1942 వద్ద గరిష్టంగా.. రూ.1887 వద్ద కనిష్టంగా ఉంది.
జియో ప్లాట్ఫామ్స్లో చిప్ దిగ్గజం క్వాల్కామ్ రూ.730 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. దీంతో జియోలో 0.15 శాతం వాటా సొంతం చేసుకున్నట్టైంది. జియో ప్లాట్ఫామ్స్లో 25.24 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఆర్ఐఎల్ రూ.1.18 లక్షల కోట్ల వరకూ సమీకరించింది. ఇప్పటికే జియోలో ఫేస్బుక్ తో సహా చిప్ కంపెనీలు ఇంటెల్, క్వాల్కామ్.. పీఈ సంస్థలు కేకేఆర్, సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేసాయి. ఈ పెట్టుబడులతోపాటు రైట్స్ ఇష్యూ ద్వారా ఆర్ఐఎల్ రూ. 53,124 కోట్లు సమకూర్చుకుంది. గతేడాది ఇంధన రిటైల్ నెట్వర్క్లో 49 శాతం వాటా అమ్మకం ద్వారా బీపీ నుంచి రూ. 7,000 కోట్లు సమీకరించింది. దీంతో రుణరహిత కంపెనీగా ఆర్ఐఎల్ ఆవిర్భవించినట్లు గత నెలలో తెలిపింది.