ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటి అయ్యారు. శనివారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఈ కీలక భేటి జరిగింది. వీరి మధ్య చర్చలపై అంశాలు బయటకు రాలేదు కానీ, రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీరి మధ్య రాజకీయ చర్చ జరిగిందా…? వ్యాపార చర్చ జరిగిందా? అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ముఖ్యులకు కూడా సారాంశం ఏమిటనేది స్పష్టత లేదు. అత్యంత సన్నిహితులు తెలిపిన వివరాల మేరకు ఇరువురి మధ్య కొద్దీ పాటి రాజకీయ అంశాలతో పాటు, ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ పెట్టుబడులపై సిదీర్ఘ చర్చ జరిగినట్టు తెలుస్తుంది.
అంబానీ వెంట ఆయన తనయుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు పరిమల్ నత్వాని కూడా ఉన్నారు. నత్వాని ముఖేష్ అంబానికి అత్యంత సన్నిహితుడు. తండ్రి ధీరుబాయ్ హవా నుండి రిలయన్స్ లో అత్యంత కీలక హోదాలో నత్వాని పని చేస్తున్నారు. 1997 లో రిలయన్స్ లో చేరిన ఆయన ప్రస్తుతం కార్పొరేట్ వ్యవహారాల ఇంచార్జిగా ఉన్నారు. ఆ సంస్ధలో ముఖేష్ తర్వాత కీలక నిర్ణయాలు, అభిప్రాయాలు ఈయనవే. పనిలో పనిగా ముఖేష్ కి నీడగా ఉంటూ రాజ్యసభలోనూ ప్రవేశించారు. 2008 లో మొదటిసారి రాజ్యసభ ప్రవేశం చేసిన నత్వాని 2014లో మరోసారి కొనసాగారు. ఇప్పుడు ఆయన పదవి గడువు ముగియనుండడంతో కొనసాగింపు కోసమే ముఖేష్ జగన్ ని కలిసారని అంతర్గత చర్చ నడుస్తోంది. ఏపీలో వచ్చేనెల నుండి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నాలుగింటిలో ఒకటి నత్వానికి కేటాయించాలని అంబానీ కోరినట్టు సమాచారం. పనిలో పనిగా రాష్ట్రంలో పెట్టుబడులపై ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగాయట.
రాష్ట్రంలోని కృష్ణ గోదావరి బేసిన్ ద్వారా అంబానీ ఇప్పటికే ప్రఖ్యాత ప్రాజెక్టు నడుపుతున్నారు. ఇకపై మరిన్ని పెట్టుబడులు పెట్టి, ఓ ముఖ్య ప్రాజెక్టుని నెలకొల్పేందుకు ముఖేష్ సిద్ధంగా ఉన్నారని… ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి ద్వారా జగన్ కి చేరవేస్తే పూర్తిగా మాట్లాడడానికి ఈ రోజు కలిసారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత ధనికుడు. తనవారికి అని ఆయన అడిగితే ఎవరైనా, ఏ పార్టీ వారైనా రాజ్యసభ సీటు ఇచ్చేస్తారు. కానీ రాష్ట్రంలో ఇరువురి అవసరాలు, ఇక్కడ నాలుగు సీట్లు ఉండడం…, పెట్టుబడులకు అవకాశాలు ఉండడం ఈ చర్చలకు బలం చేకూరుస్తుంది.