‘భారత్ లో డేటా డిమాండ్ కు తగ్గట్టు 5G సొల్యూషన్ అభివృద్ధి చేసింది. స్పెక్ట్రమ్ కేటాయింపులు రాగానే వచ్చే ఏడాది ఈ సేవలు అందుబాటులోకి రావొచ్చు. సెర్జింజన్ గూగుల్ తో కలిసి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ ఆధారిత జియో స్మార్ట్ ఫోన్ ఆపరేటింగ్ సిస్థం తీసుకొచ్చింద’ని రిలయన్స్ 43వ ఏజీఎం వర్చువల్ సమావేశంలో అధినేత ముఖేశ్ అంబానీ ప్రకటించారు. సవాళ్లను ఎదుర్కొని రిలయన్స్ జియో తన హవా కొనసాగిస్తోందని తెలిపారు.
అందుబాటు ధరల్లోనే 5G స్మార్ట్ ఫోన్స్ అందిస్తామన్నారు. 2జీ ముక్త్ నినాదంతో సరికొత్త స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నామని ముఖేశ్ తెలిపారు. ఫీచర్ ఫోన్ స్థానంలో అందరికీ ఈ స్మార్ట్ ఫోన్ అందించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇందుకు మైక్రోసాఫ్ట్, గూగుల్ తో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నామన్నారు. 5G సేవలతో ప్రపంచ గమనం మారనుందన్నారు. విద్య, వైద్య రంగాల్లో జియో 5G సేవలతో కొత్త శకం ఆరంభమవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ స్టార్టప్స్ లక్ష్యాలకు జియో సహకారం అందిస్తుందని ఉద్ఘాటించారు.
కొనుగోలుదారులు, ఉత్పత్తిదారులు, కిరాణా వ్యాపారులను అనుసంధానం చేస్తూ జియో మార్ట్ ఉంటుందని స్పష్టం చేశారు. వాట్సప్, జియో మార్ట్ విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతోందని అన్నారు. కిరాణా దుకాణాలకు జియో మార్ట్ తో 48 గంటల్లోనే సాంకేతికంగా కొత్త రూపు వస్తోందని అన్నారు. జియో మార్ట్ ద్వారా నాణ్యమైన ఉత్తత్తులు అందిస్తామన్నారు. తొలి ఆర్డర్ కు కరోనా కాంప్లిమెంటరీ కిట్ ఉచితంగా అందిస్తామన్నారు.