ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన శైలిలో అభివృద్ధి – సంక్షేమం ఎజెండాతో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ కార్యక్రమాలను చేపట్టిన ఆయన తాజాగా మరో కీలక ప్రకటన చేశారు.
వైఎస్ఆర్ ఆసరా పేరుతో మరో నూతన సంక్షేమ పథకాన్ని వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత పెద్ద ఎత్తున మహిళలకు మేలు చేసే కార్యక్రమం ఎప్పుడూ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తలపెట్టలేదని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
27,168 కోట్లతో ….
దేవుడి దయ, అందరి చల్లని దీవెనలతో ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతున్నానని వైఎస్ జగన్ అన్నారు. “మీ అందరికీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, ఈరోజు మీ జగన్ మీ ముందుకు వస్తున్నాడు. పొదుపు సంఘాలకు గత ఎన్నికల వరకు ఎంతమేర రుణాలు వుంటాయో…దానిని నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతుల్లోనే పెడతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాను. వైయస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా వారికి మేలు చేస్తున్నాం. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 8,71,302 పొదుపు సంఘాల్లో వున్న 87,74,674 మంది మహిళలకు లబ్ధి జరుగుతుంది. 2019 ఏప్రిల్ 11వ తేదీ వరకు వారి పేరుతో బ్యాంకుల్లో ఉన్న అప్పు రూ.27,168.83 కోట్లు పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉండే ఈ అప్పు మొత్తాన్ని నాలుగు విడతల్లో చెల్లింపు చేయనున్నాం“ అని జగన్ ప్రకటించారు.
రిలయన్స్ కూడా మన కోసం…
ఆంధ్రప్రదేశ్ మహిళల చరిత్రను మార్చడానికి కట్టుబడిన సీఎంగా, ఒక మంచి అన్నగా, తమ్ముడిగా డబ్బును మహిళల ఖాతాలోనే జమ చేస్తున్నానని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. “ఈ డబ్బును పెట్టుబడిగా మార్చుకుని, బ్యాంకుల ద్వారా చిన్నచిన్న రుణాలు తీసుకోవాలి. పాడి పశువులు, వ్యాపారాలు, గొర్రెలు, మేకల కొనుగోలు చేయాలనుకుంటే, దానికి కూడా బ్యాంకులు, దిగ్గజ సంస్థలైన రిలయన్స్, ఐటిసి, అమూల్ తదితర కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకున్నాం. ప్రభుత్వం ఇచ్చే డబ్బు ఎలా వాడుకుంటారు అనేది పూర్తిగా మీ ఇష్టానికే వదిలేస్తున్నాం. వ్యాపారులు చేసుకునేందుకు, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని అనుకుంటే..ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు, బ్యాంకులతో సమన్వయం చేసుకుంటూ శిక్షణ, మార్కెటింగ్ వంటి వసతులను వినియోగించుకోవాలి. ఇప్పటికే దీనిని వైయస్ఆర్ చేయూత పథకానికి వర్తింపచేశాం. అలాగే మీరు కూడా చేసుకోవాలని అనుకుంటే అందుకు ప్రభుత్వ పరంగా ప్రోత్సహిస్తాం.“ అని జగన్ ప్రకటించారు.
ఆడబిడ్డలకు అండగా నిలిచేలా
మహిళల అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం అన్ని విభాగాలను సమన్వయం చేసిందని సీఎం జగన్ అన్నారు. “మెప్మా, సెర్ఫ్ అధికారులను సంప్రదించినా 1902 నెంబర్కు ఫోన్ చేసినా మీకు సహాయం అందిస్తారు. వాలంటీర్లను సంప్రదించినా కూడా కంపెనీలు, బ్యాంకుల ద్వారా మీకు చేలు జరిగేలా చూస్తారు. మహిళా సాధికారత కోసం దేశంలో ఏక్కడా లేని విధంగా గత పదిహేను నెలలుగా అడుగులు వేస్తున్నాం. అమ్మ ఒడి అనే కార్యక్రమం ద్వారా ఏటా 43 లక్షల తల్లుల ఖాతాల్లో ఏటా రూ.15వేలు జమ చేస్తున్నాం. దీనివల్ల 82 లక్షల మంది పిల్లలకు దీని వల్ల మేలు జరుగుతోంది.“ అని ప్రకటించారు.
నాటికి నేటికి ఇదే తేడా!
ఇంటర్ తరువాత ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపివేయకూడదనే ఉద్దేశంతో విద్యాదీవెన కార్యక్రమం ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. “గత ప్రభుత్వం పెట్టిన రూ.1880 కోట్ల బకాయిలను కూడా తీరుస్తూ రూ.4200 కోట్ల రూపాయలు నేరుగా పిల్లల చదువుల కోసం ఇచ్చాం. గతంలో చాలీచాలని విధంగా పేద విద్యార్ధులకు ఫీజు రియింబర్స్మెంట్ను అమలు చేశారు. ఈ విద్యాసంవత్సరం ఫీజురియింబర్స్మెంట్ ను కూడా తల్లుల ఖాతాలకు జమ చేస్తున్నాం. దానివల్ల తల్లులు తమ పిల్లల చదువులను పర్యవేక్షించేలా, కాలేజీల్లో వసతులను కూడా పరిశీలించి, అవసరమైతే నిలదీసే అవకాశం వుంటుంది. వైయస్ఆర్ వసతి దీవెన ద్వారా ఏడాదికి రూ.పదివేల నుంచి రూ.ఇరవై వేల వరకు దాదాపు రూ.1221 కోట్ల రూపాయలు తల్లుల ఖాతాలకు జమ చేశాం. రెండు దఫాలుగా రూ.పదివేలు, మరో ఆరు నెలల తరువాత మరో పదివేల రూపాయల చొప్పన తల్లుల ఖాతాలకు జమ చేస్తున్నాం.“ అని సీఎం జగన్ తెలిపారు.