ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లను అక్టోబర్ 5 నుండి తెరవాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంకా కరోనా అదుపులోకి రాలేదు. ప్రతిరోజూ 6 వేలకు పైగా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లను తెరవడం భావ్యం కాదని భావించింది జగన్ సర్కారు.
మంగళవారం ఈ విషయమై మీడియాతో మాట్లాడారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవంబర్ నుండి స్కూళ్లను తెరవాలని నిర్ణయించామని తెలిపారు. అయితే ముందు అనుకున్నట్లు పిల్లలకు జగనన్న విద్యా కానుక అక్టోబర్ 5న మొదలవుతుందని ఆయన అన్నారు. విద్యార్థులకు కిట్లను ప్రభుత్వం అందజేయనుంది. పరిస్థితులను బట్టి సీఎం వైఎస్ జగన్ ఏదైనా స్కూలుకు కూడా ఆరోజు వెళతారని సురేష్ మీడియాతో అన్నారు.