Mahavishnuvu: శ్రీ మహావిష్ణువును ఏ పూలతో పూజిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం.
శ్రీమహావిష్ణువును తులసి దళాలు , తామర పువ్వులు , తెల్లని సన్నజాజులు, అవిసెపువ్వు లతో పూజించినవారు విష్ణుపదాన్ని పొందుతారు అనడం లో సందేహం లేదు.కడిమి పువ్వులతో అర్చించిన వారు చాలా తేలికగా స్వర్గ సుఖాలు పొందుతారు. కడిమి పువ్వులను తెచ్చి విష్ణుభగవానుడి తలపై రాశిగా పోసి అలంకరించినవారికి వెయ్యి ఆవులను దానం చేసిన ఫలితం వచ్చేస్తుంది.
కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువును సన్నజాజి పువ్వులతో పూజ చేసినవారికి వంద కపిల గోవులను దానం చేసిన ఉత్తమ ఫలం ప్రాప్తిస్తుంది.వసంత ఋతువులో ఆ శ్రీ మహావిష్ణువును మల్లికా పువ్వులతో పూజిస్తే మనోవాక్కాయలతో చేసిన పాపాలు అన్ని దహింపబడతాయి.
వసంత ఋతువులో శ్రీమహావిష్ణువును సురపొన్న పువ్వులతో పూజ చేసినవారు ముక్తుడైన యోగి అవుతారు అని చెప్పబడింది.
శ్రీమహావిష్ణువు అవతారమైన మాధవుని దవనంతో పూజిస్తే వంద కపిల గోవులను దానం ఇచ్చిన ఉత్తమ ఫలితం దక్కుతుంది.
ఆ శ్రీమహావిష్ణువు కు అవిసె పువ్వులతో మాలను కట్టి సమర్పించిన వారికి దేవేంద్రుడు కూడా నమస్కరించేంత పుణ్యం కలుగుతుంది. విష్ణు భగవానుడిని అనంత, అశోక పువ్వులతో పూజిస్తే చుక్కలు చంద్రుడు ఉన్నంత కాలము శోకం అనేది లేకుండా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు.అన్ని కాలాలలో మామిడి మొక్క పూతను విష్ణువు శిరస్సుపై ఉంచి పూజించేవారికి కోటి గోవులను దానం ఇచ్చిన ఫలితం వస్తుంది.
జమ్మిపత్రితో శ్రీమహావిష్ణువును పూజించి, అర్చించడం వలన మహా ఘోరమై ఉన్న మార్గం లో కూడా తేలికగా వెళ్లగలుగుతారు.
వర్ష కాలం లో శ్రీమహావిష్ణువును చంపక పువ్వులతో పూజిస్తే, పునర్జన్మ అంటూ ఉండదు.
కలిగొట్టు పువ్వులతో శ్రీమహావిష్ణువును పూజిస్తే బంగారం దానం చేసినటువంటి ఫలితం కలుగుతుంది.
బంగారు వర్ణంలో ఉండే మొగలి పువ్వులతో శ్రీమహావిష్ణువును పూజిస్తే, కోటిజన్మల నుండి పోగైన పాపపు రాశి కూడా భస్మమై పోతుంది.ఈ భూమిదా ఉన్న అన్ని రకాల పువ్వులతో శ్రీమహావిష్ణువును పూజించి అర్చించిన వారికి ఎలాంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం తులసిదళంతో శ్రీమహావిష్ణువును పూజించడం వలన కూడా పొందవచ్చు. అయినాకూడా పైన చెప్పిన పువ్వులు అందుబాటులో ఉన్నవారు వాటితో పాటు తులసి దళం తో కూడా పూజ చేయడం అనేది ఉత్తమం గా చెప్పబడింది.