Revanth Reddy : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ ఏసీబీ కోర్టు. విచారణ వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి నిందితులపై అభియోగాలు నమోదయ్యాయి. మరోవైపు ఈనెల 19న సాక్షుల విచారణ షెడ్యూల్ను కోర్టు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. రేవంత్రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్పై ఏసీబీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది.
నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 కింద న్యాయస్థానం అభియోగాలు నమోదు చేసింది. రేవంత్రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బీ రెడ్ విత్ 34 అభియోగం నమోదు చేసింది. మరోవైపు, తమపై అభియోగాల్లో నిజం లేదని రేవంత్తో పాటు ఇతర నిందితులు తోసిపుచ్చారు. కాగా, సండ్ర వెంకటవీరయ్యపై గతంలోనే ఏసీబీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది. ఇదిలావుంటే ఈనెల 19న సాక్షుల విచారణ షెడ్యూలను ఏసీబీ కోర్టు ఖరారు చేయనున్నట్లు స్పష్టం చేసింది.
చంద్రబాబుకూ టెన్షనే!
ఇదిలావుంటే, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటీషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటీషనర్ తరపున న్యాయస్థానంలో ప్రశాంత్ భూషణ్ వాదనలు విన్పించారు. ఈ అంశంపై కచ్చితమైన విచారణ తేదీని ప్రకటించాలని కోరగా.. లిఖితపూర్వక ఆదేశాల్లో స్పష్టం చేస్తామన్నారు.
Revanth Reddy : ఇదీ ఆ కేసు హిస్టరీ
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్ సన్ ని టిడిపి అభ్యర్థి ఓటు వేసే విధంగా ప్రభావితం చేసేందుకు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు మల్కాజ్గిరి కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడైన రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి యాభై లక్షల రూపాయల నగదు ఇచ్చిన ఉదంతం గుర్తుండే ఉంటుంది.అదే సమయంలో స్టీఫెన్సన్ కి చంద్రబాబు కూడా ఫోన్ చేసి డోంట్ వర్రీ ..అవర్ బాయ్స్ బ్రీఫ్డ్ మీ..అంటూ ఆయనకు భరోసా ఇవ్వడం,ఆ ఆడియో టేపు బయటకు రావడం కూడా విదితమే. స్టీఫెన్ సన్ ఇచ్చిన సమాచారం మేరకు ఎసిబి అధికారులు దాడిచేసి రేవంత్రెడ్డిని రెడ్ హాండెడ్ గా అరెస్టు చేసి నగదు స్వాధీనపరుచుకోవడం జరిగింది. ఈ ఉదంతం చోటు చేసుకోగానే హుటాహుటిన చంద్రబాబునాయుడు హైద్రాబాద్ నుండి అమరావతికి షిఫ్ట్ అయిపోయారు.అనేక మలుపులు తిరిగిన అనంతరం ఎట్టకేలకు ఈ కేసు విచారణ వేగవంతం కానున్నది.తెలుగుదేశం పార్టీ వర్గాలకు ఇది గుబులు పుట్టించే విషయమే.