(హైదరాబాద్ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్పై, టిఆర్ఎస్ సర్కార్పై ఒంటికాలి మీద లేచే కాంగ్రెస్ పార్టీ ఎంపి రేవంత్ రెడ్డి తన పోరాటాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. పార్టీ స్టాండ్తో పని లేకుండా రేవంత్ రెడ్డి కేసిఆర్పై దూకుడుగా వెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా తెలంగాణ సర్కార్ చర్యలపై ఏకంగా సుప్రీం కోర్టునే ఆశ్రయించారు రేవంత్ రెడ్డి.
తెలంగాణలో సచివాలయం కూల్చివేతతో ప్రజాధనం వృధా చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం ఇటీవల కొట్టివేసింది. దీనితో రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రేవంత్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే సచివాలయం కూల్చివేతపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ)కు ఫిర్యాదు చేసిన రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్కు వచ్చిన ఎన్జీటీ బృందాన్ని కలిసి తన ఫిర్యాదులోని అంశాలను వివరించారు.
సుప్రీం కోర్టులకు వ్యతిరేకంగా కొత్త సచివాలయ నిర్మాణానికి ఇప్పటి వరకూ వివిధ శాఖలు అనుమతులు ఇచ్చాయని కమిటీకి వివరించారు రేవంత్ రెడ్డి. ప్రధానంగా హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ఒక కిలో మీటరు పరిధి వరకూ ఎలాంటి శాశ్వత నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదనీ 2001లోనే సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఎలాంటి శాశ్వత నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదనీ పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
ఇటీవల శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపైనా రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వంపై, కెసిఆర్పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. విహెచ్ లాంటి సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి తీరును విమర్శిస్తున్నా ఆయన మాత్రం సిఎం కేసిఆర్ పైనా, టిఆర్ఎస్ సర్కార్పైనా పోరాటంలో ఏ మాత్రం తగ్గడం లేదు. ముందుకే వెళుతున్నారు.