తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలతో కేసీఆర్ కు పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవనే చెప్పాలి. దానికి కారణం… రాజకీయంగా ఆయనకు ఉన్న బలమో లేక ఐకమత్యం కొరవడిన ప్రతిపక్షాల పన్నితీరో తెలియదు కానీ… తెలంగాణలో అధికార టీఆర్ఎస్ ని మరీ ఇబ్బంది పెట్టే స్థాయి ప్రతిపక్ష పాత్ర పోషించే నాయకులు లేరనే చెప్పాలి. కేసీఆర్ అలా ప్లాన్ చేసుకున్నారా లేక అలా కలిసివస్తుందో తెలియదు కానీ… అలా జరిగిపోతూ ఉంది! ఈ క్రమంలో అవకాశం చిక్కినప్పుడల్లా కేసీఆర్ ని ఇబ్బంది పెట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే… టక్కున గుర్తొచ్చే పేరు రేవంత్ రెడ్డి అనే చెప్పాలి.
సొంతపార్టీలో కొందరు సీనియర్ నేతల నుంచి సహకారం లేకపోయినా.. కేసీఆర్ మీద ఒంటికాలి లేవడంలో ఏమాత్రం వెనక్కి తగ్గని రేవంత్ రెడ్డి… ఇటీవల కూడా నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్ నిర్మించారని, ఇక ఆ నిర్మాణం పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉందని కేటీఆర్ పై రేవంత్ రెడ్డి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. దాంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేటీఆర్కు నోటీసులు ఇచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ఎన్జీటీ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. దీంతో రేవంత్ రెడ్డికి షాక్ తగిలిందనే అనే చెప్పాలి.
అయినా కూడా పట్టువదలని రేవంత్ ఈసారి కేసీఆర్ పై మైండ్ గేమ్ మొదలుపెట్టారు. “మంత్రి ఈటెల రాజేంద్రపై వేటు పడబోతోంది. ప్రస్తుతం కేసీఆర్ అందుకోసం కత్తి నూరుతున్నారు. మరో వారం రోజుల్లో మంత్రి వర్గం నుంచి ఈటెల రాజేందర్ తల ఎగిరిపోబోతోంది. ప్రస్తుతం కరోనా వైరస్ చికిత్సలో భాగంగా జరుగుతున్న వైఫల్యాలు మొత్తం ఈటెల ఖాతాలో వేసి, ఆయన్ను తప్పించే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయాలను టీఆర్ఎస్ మిత్రుడే నాకు ఫోన్ చేసి చెప్పారు” అన్ని రేవంత్ మరో బాంబు పేల్చారు. మరి దీని పర్వాసనాలు ఎలా ఉండబోతున్నాయని.. ఫలితం ఎవరివైపు ఉండబోతోంది అనేది తెలియాలంటే… ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!