తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఒకింత దూకుడుగా స్పందించే సంగతి తెలిసిందే.
అవకాశం దొరికిన ప్రతి సందర్భంలో రేవంత్ గులాబీ దళపతిని టార్గెట్ చేస్తుంటారు. తాజాగా ఆయన తనయ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత విషయంలో రేవంత్ రెడ్డి కొత్త స్టెప్ తీసుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా కేసీఆర్ను ఇరకాటంలో పెట్టే ప్లాన్ వేశారు.
కవితకు షాక్ తగలడంతో….
గత లోక్ సభ ఎన్నికల్లో నిజమాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన కవిత ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. ఓటమి అనంతరం కవితను క్రియాశీల రాజకీయాల్లోకి తీసుకురావాలని భావించిన సీఎం కేసీఆర్ అందుకు నిజామాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికను సరైన అంశంగా ఎంచుకున్నారు. టీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్సీగా గెలిచిన భూపతిరెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో చేరటంతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయింది. అక్కడి నుంచి కవిత రీ ఎంట్రీ ప్లాన్ అమలు జరుగుతోంది.
ఎన్నో ట్విస్టులు…
నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు గతంలోనే నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ ఉప ఎన్నిక బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా సుభాష్రెడ్డి బరిలో నిలిచారు. టీఆర్ఎస్ తరఫున మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత, బీజేపీ అభ్యర్థిగా పోతన్కర్ లక్ష్మీనారాయణ బరిలో ఉన్నారు. అయితే, పోలింగ్ సమయంలో కరోనాతో ఎన్నికను ఈసీ వాయిదా వేసింది. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని కృషి చేస్తున్నాయి. నిజామాబాద్ , కామారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 824 మంది ఓటర్లుగా ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇందులో టీఆర్ఎస్ సంఖ్యా బలం 504 ఉండగా.. ఎంఐఎంకు చెందిన 28 మంది ఓటర్లు టీఆర్ఎస్కే మద్దతు పలుకనున్నారు. 66 మంది స్వతంత్ర ఓటర్లు కూడా కవిత గెలుపు కోసం టీఆర్ఎస్కే ఓటు వేసేందుకు మేము సంసిద్ధంగా ఉన్నామని ఇది వరకే ప్రకటించారు. దీంతో టీఆర్ఎస్ సంఖ్యా బలం 598కి చేరింది. కాంగ్రెస్ పార్టీకి 141 సంఖ్యాబలం, బీజేపీకి 85 మంది ఓటర్ల బలముంది.
రేవంత్ సంచలన వ్యాఖ్యలు
అయితే, తాజగా కాంగ్రెస్ నేత, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్లో ఎంపీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ లో రిసార్ట్ లో క్యాంప్లు నిర్వహిస్తోందని ఆరోపించారు. ఆధారాలతో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిఘా బృందాలు పంపి నిజామాబాద్ లో తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. స్థానిక నేతలను రిసార్ట్ కి తరలించిన వారిపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు. నిజామాబాద్ వ్యవహారంపై కేంద్రం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం అయితే న్యాయపోరాటం సైతం చేస్తామని ప్రకటించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో టీఆర్ఎస్ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే.